Vehicle Insurance: మీ వాహనానికి బీమా లేదా? భవిష్యత్తులో మీకు ఇబ్బందులు తప్పవు. చివరకు పెట్రోల్ కూడా దొరక్కపోవచ్చు. రోడ్లపై తిరుగుతున్న బీమా లేని వాహనాల సమస్యను పరిష్కరించడానికి కీలక నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు. అలాంటి వాహనాలకు ఇంధనం సరఫరా చేయవద్దని సూచన చేసింది. బీమా ఉన్న వాహనాలకు ఇంధనం సరఫరా అయ్యేలా ప్రైలట్ ప్రాజెక్టును అమలుచేయాలని సూచించింది.
దేశంలో ఇన్సూరెన్స్ లేకుండానే సగానికి పైగానే వాహనాలు నడుస్తున్నాయి. దీనిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో వాహనాలకు బీమా లేకుంటే.. ఆయిల్ లేకుండా చేయాలని ఆదేశించింది. రిజిస్ట్రేషన్ సమయంలో కొత్త కార్లకు నాలుగేళ్లు, టూ వీలర్స్కు ఆరేళ్లు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని పేర్కొంది. బీమా అమల్లో ఉన్న వాహనాలకు ఆయిల్ సరఫరా జరిగేలా చూడాలని వెల్లడించింది. దీనిపై కేంద్ర రవాణా శాఖతో సంప్రదించి ఓ ప్రైలట్ ప్రాజెక్టును అమలు చేయాలని ఆదేశించింది.
దేశంలో మొత్తం 30.48 కోట్ల వాహనాలు ఉండగా, అందులో దాదాపు 56 శాతానికి సంబంధించిన వాహనాలకు ఎలాంటి థర్డ్ పార్టీ బీమా లేకుండానే నిర్లక్ష్యంగా తిరుగుతున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 22 శాతం రోడ్డు ప్రమాదాలు బీమా లేని వాహనాల వల్లే జరుగుతున్నాయి. ఇన్యూరెన్స్ లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితుల కుటుంబాలకు సకాలంలో పరిహారం అందకుండా పోతోందని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ద్వారా జీవించే ప్రాథమిక హక్కును భంగపరచడమేనని స్పష్టంచేసింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు జస్టిస్ సంజయ్ కరోల్-జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మార్గదర్శకాలు జారీ చేసింది.
బీమా లేని వాహనాలకు ఆటోమేటిక్గా ఈ-చలానాలు జారీ చేయడానికి వీలుగా ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్-ANPR కెమెరాలను విహాన్ – VAHAN డేటాబేస్తో అనుసంధానించాలని పేర్కొంది. రియల్టైమ్ ఇన్సూరెన్స్ స్టేటస్ను చెక్ చేయడానికి పోలీసులకు డిజిటల్ పరికరాలు సమకూర్చాలని సూచించింది. బీమా లేని వాహనం ఉపయోగించేవారిపై మోటార్ వాహన చట్టం-1988లో సెక్షన్ 196 కింద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రస్తావించింది. ప్రైవేటు వాహనాలకు నాలుగు అంచెల బీమా విధానాన్ని ప్రతిపాదన చేసింది. థర్ డ్పార్టీ బీమా తప్పనిసరి. బీమా చేసిన వాహనానికి అయ్యే నష్టాన్ని భర్తీ చేసే కవరేజీలను ఆప్షనల్గా అమలు చేయాలని పేర్కొంది.
ALSO READ: కర్ణాటక పరిశ్రమలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి, ఐసీయూలో మరో ముగ్గురు!
బీమా కొనుగోలు చేసేటప్పుడు ఈ తరహా ఆప్షన్లతో కూడిన ఫామ్ అందించి వారు ఎంచుకున్న ఆప్షన్ల ఆధారంగా కవరేజి కల్పించాలని తెలిపింది. ఒకవేళ ఏమైనా మార్పులు, చేర్పులు చేయాలనుకుంటే ఐఆర్డీఏ ఆ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. వీటికి సంబంధిత పక్షాలు ఆగస్టు 14 లోగా నివేదికలు దాఖలు చేయాలని, తదుపరి విచారణ ఆగస్టు 18న జరుగుతుందని పేర్కొంది. 2018లో కొత్త వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు కార్లకు మూడు సంవత్సరాలు, టూ వీలర్స్కు ఐదేళ్లు థర్డ్-పార్టీ బీమాను తప్పనిసరి చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెల్సిందే.