Chemical Gas Leak: కర్ణాటకలోని యాద్గిర్ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కడేచూరు పారిశ్రామిక ప్రాంతంలోని ఒక రసాయన పరిశ్రమలో ప్రమాదవశాత్తు తీవ్రమైన రసాయన వాయువు లీకైంది. ఈ విష వాయువును పీల్చడంతో అక్కడికక్కడే ముగ్గురు కార్మికులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ హఠాత్ పరిణామంతో పరిశ్రమ ప్రాంగణంలో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలు, గందరగోళం నెలకొన్నాయి.
ఈ భయానక ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారి పరిస్థితి చాలా విషమంగా ఉండటంతో, మెరుగైన అత్యవసర వైద్య చికిత్స కోసం వారిని వెంటనే సమీపంలోని రాయచూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు వారికి ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
విషాదకరమైన విషయమేమిటంటే, ఈ ప్రమాదంలో మరణించిన వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒకరు ఉన్నారు. నారాయణపేట జిల్లా, కృష్ణ మండలం, ఆలంపల్లి గ్రామానికి చెందిన గణేశ్ అనే వ్యక్తి ఈ వాయు లీకేజీ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. బతుకుదెరువు కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్లిన యువకుడు ఇలా మృతి చెందడంతో ఆయన స్వగ్రామంలో తీవ్ర శోకసంద్రం అలుముకుంది. ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ప్రభుత్వ జీతం.. సొంత వ్యాపారం.. టీచర్ల భాగోతంపై ‘బిగ్ టీవీ’ ఎక్స్క్లూజివ్!