Tamilnadu Result: అదృష్టం ఉంటే చివరి క్షణంలో గట్టెక్కవచ్చు. అలాంటి సందర్భాలు ఎన్నికల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. సోమవారం వెల్లడైన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వివిధ పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు ఊహించని రీతిలో ఓటమి పాలయ్యారు. అలాంటి వారిలో డీఎంకెకు చెందిన మంత్రి కూడా ఒకరు. ఆయన కేవలం ఒక్క ఓటు తేడాతో ఓటమి పాలయ్యారు. ఎవరా మంత్రి? ఎక్కడ?
ఒక్క ఓటుతో గెలిచిన టీవీకే పార్టీ అభ్యర్థి
తమిళనాడు ఎన్నికల్లో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్నికల ఫలితాల్లో డిఎంకె మంత్రి పెరియకరుప్పన్ కేవలం ఒక్క ఓటు తేడాతో ఓటమి పాలయ్యారు. తిరుప్పత్తూరు అసెంబ్లీ సీటు నుంచి టీవీకే అభ్యర్థి శీనివాస సేతుపతి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. ఒక్క ఓటు రాజకీయ నేతల తలరాతను ఎలా మార్చగలదో ఈ ఫలితం ద్వారా రుజువైంది.
డీఎంకె ప్రభుత్వంలో సహకార శాఖ మంత్రి పెరియకరుప్పన్ తిరుప్పత్తూరు నియోజకవర్గం నుంచి తన అదృష్టానికి పరీక్షించుకున్నారు. ప్రతీ రౌండ్లోనూ మంత్రికి-టీవీకే అభ్యర్థిని గట్టిపోటీ నెలకొంది. మంత్రి గెలుపు నల్లేరు మీద నడకగా భావించారు ఆ పార్టీ నేతలు. నువ్వానేనా అన్నస్థాయిలో పోటీ సాగింది.
డీఎంకె మంత్రి రెండు దశాబ్దాల ఆధిపత్యానికి తెర
ఫలితం అర్ధరాత్రి వరకు తేలలేదు. తమిళగ వెట్రి కజగం పార్టీ అభ్యర్థి శీనివాస సేతుపతి నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఓట్ల లెక్కింపు చివరి వచ్చేసరికి కేవలం ఒక్క ఓటుతో సేతుపతి విజయం సాధించారు. టీవీకే అభ్యర్థి సేతుపతికి మొత్తం 83,375 ఓట్లు వచ్చాయి. డీఎంకె మంత్రి కేఆర్ పెరియకరుప్పన్ కేవలం ఒక్క ఓటు తేడాతో ఓటమి పాలయ్యారు.
2006 తర్వాత ఈ నియోజకవర్గం నుంచి పెరియకరుప్పన్ ఓడిపోవడం ఇదే మొదటిసారి. ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమైనదేనని నేతలు పదే పదే చెబుతారు. ఈ విషయం అక్షరాలా నిజమైంది.దీంతో పెరియకరుప్పన్ రెండు దశాబ్దాల ఆధిపత్యానికి తెరపడింది. బీజేపీ అభ్యర్థి తిరుమరన్ 29 వేల ఓట్లు వచ్చాయి.
ALSO READ: ప్రతి ఓటూ నా అమూల్యమైన నమ్మకానికి చిహ్నం”.. ఓటమిపై స్టాలిన్ భావోద్వేగ ట్వీట్
తమిళనాడుకు జరిగిన అసెంబ్లీ టీవీకే పార్టీ 108 సీట్లు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. తొలిసారి బరిలోకి దిగిన టీవీకే పార్టీ మ్యాజిక్ మార్క్ కేవలం 10 సీట్లు తక్కువ. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్ పార్టీ.. మిగతా పార్టీల మద్దతు కోరనుంది. అందులో కాంగ్రెస్-5 సీట్లు, పీఎంకే-4, వామపక్ష పార్టీలు-4, వీసీకే-2 సహా చిన్న పార్టీలు ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ.. విజయ్ తో మాట్లాడినట్టు తెలుస్తోంది.