Short Weighing: స్వేచ్ఛ బ్యూరో: జోగులాంబ గద్వాల జిల్లాలో తూనికల కొలతల శాఖ (లీగల్ మెట్రాలజీ) అధికారుల తనిఖీలు పూర్తిగా కరువయ్యాయని స్థానిక ప్రజలు, వినియోగదారులు, రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు తక్కువ తూకాలతో వినియోగదారులను, రైతులను మోసం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
పట్టణాలు, గ్రామాలలోని కిరాణా షాపులు చికెన్ మటన్ సెంటర్లలో ముద్రణ స్టాంపింగ్ లేని ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు, పాత బాట్లను ఉపయోగిస్తున్నారు. కొన్నిచోట్ల పెట్రోల్ బంకుల్లో సైతం కొలతల్లో విపరీత తేడాలు ఉంటున్నాయని, కొన్ని బంకుల్లో ఇస్తారాజ్యంగా వ్యవహరిస్తూ ఉండడంతో వాహనదారులకు సరియైన మైలేజీ రాక తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రతినిత్యం జరిగే లావాదేవీల్లో ఎక్కడ చూసినా తూకంలో మోసాలతో ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏర్పడుతుందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. నిత్యం కూరగాయల మార్కెట్ లో విక్రయించే కూరగాయల తూకంలో మోసాలకు పాల్పడుతూ వినియోగదారులను మోసం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
ఇప్పటికైనా వ్యాపార, వాణిజ్య సముదాయాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అక్రమ సంపాదనకు అలవాటుపడ్డ వ్యాపారాలలో కొలతలలో వ్యత్యాసాలను సూచించే వేయింగ్ మిషన్లను సీజ్ చేసి ప్రతి ఏటా బాట్ల నవీకరణ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడడంలో అధికారులు విఫలమవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించి కాపాడాలని వినియోగదారులు, రైతులు, స్థానికులు కోరుతున్నారు. తూనికలు, కొలతల అధికారులు ఇప్పటికైనా స్పందించి తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also read: హోటళ్ల ముసుగులో ఓపెన్ బార్లు.. తూముకుంట దాబాల్లో ఏం జరుగుతోంది?