Odisha News: రోజు రోజుకూ అభివృద్ధి పథం వైపు దూసుకుపోతోంది దేశం. టెక్నాలజీ రంగంలో కొత్త కొత్త మైలురాయిని అందుకుంటుంది. కానీ.. కొన్ని ప్రాంతాల్లో సామాజిక కట్టుబాట్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. చాలామందిని వెంటాడుతున్నాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఓ దంపతుల కథ. వారి కొడుకు అంత్యక్రియలకు ఏ ఒక్కరూ హాజరుకాలేదు. వినడానికి విచిత్రంగా ఉన్నా, ముమ్మాటికీ నిజం.
ప్రేమ వివాహం వారికి శాపం
ఒడిషాలోని నవరంగపూర్ జిల్లాలోని అంటిపడ గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన భల్ నాయక్-శాంతి మాఝి 25 ఏళ్ల కిందట ప్రేమించుకున్నారు. వారిద్దరు వేర్వేరు కులాలకు చెందినవారు. మనసులు కలవడంతో జీవితాంతం ఒకరికి తోడుగా మరొకరు ఉండాలని భావించారు. ఇదే క్రమంలో వివాహం చేసుకున్నారు.
వారిద్దరు వేర్వేరు కులాలకు చెందినవారు కావడంతో ఇరువర్గాల వారు బహిష్కరించారు. సింపుల్ గా చెప్పాలంటే ఆ గ్రామం నుంచి వారిని వెలి వేశారు. గ్రామానికి దూరంగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే క్రమంలో వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరు అమ్మాయి, మరొకరు అబ్బాయి. కొద్దిరోజుల కిందట కూతురికి వివాహం జరగడంతో అత్తింటికి వెళ్లింది.
రెండున్నర దశాబ్దాలపాటు గ్రామానికి దూరంగా
కొద్దిరోజుల కిందట భల్ నాయక్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇప్పుడు కొడుకు నవీన్ 20 ఏళ్లు. అనారోగ్యం బారిన పడడంతో క్షీణించి శుక్రవారం మృతి చెందాడు. నవీన్కు అంత్యక్రియలు నిర్వహించడానికి ఇరువర్గాల వారు రాలేదు. దాదాపు 12 గంటల సమయం వరకు ఇంటి వరండాలో మృతదేహం ఉంది. తల్లి మాత్రం కొడుకు మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరు అయ్యింది.
కేవలం ప్రేమించి పెళ్లి చేసుకున్న కారణంగా దాదాపు రెండున్నద దశాబ్దాల పాటు మా కుటుంబాన్ని వెలి వేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తనలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదని బాధపడింది. ఈ విషయం తెలుసుకున్న ఆర్ఎస్ఎస్-బజరంగ్దళ్ సభ్యులు శాంతి ఇంటికి చేరుకున్నారు. ఆమె చెప్పినదంతా విని షాకయ్యారు.
ALSO READ: ఢిల్లీలో ఘోరం.. నాలుగు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం
ఆమె ఇంటి నుంచి కొడుకు మృతదేహాన్ని మూడు కిలోమీటర్లు తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిదండ్రుల ప్రేమ వివాహం ఆ బిడ్డలకు శాపంగా మారింది. మనిషి బతికి ఉన్నంతవరకు పంతం, పట్టుదల. మరణించిన తరువాత కూడా వారిపై ఇరువర్గాల వారికి పగ తీరలేదు. మొత్తానికి ప్రేమ వివాహం ఏమోగానీ, రెండున్నర దశాబ్దాలపాటు ఒంటరి జీవితం గడిపారు భల్-శాంతి దంపతులు.