Makara Jyothi 2026: శబరిమల మకరజ్యోతి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్తుంటారు. ఈ ఏడాది మకరవిళక్కు.. జనవరి 14న నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున శబరిమల కొండలకు ఎదురుగా ఉన్న పొన్నాంబలమేడుపై మకరజ్యోతిని వెలిగిస్తారు. ఆ రోజు మధ్యాహ్నం 3.13 గంటలకు దివ్య జ్యోతి దర్శనమిస్తుంది. ఈ అద్భుతమైన ఘట్టాన్ని వీక్షించేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు మాలధారణ, ఇరుముడితో శబరిమలకు చేరకుంటారు.
జ్యోతి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శబరిమల దేవస్వం బోర్డు కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. భక్తులు ఇబ్బంది పడకుండా ముందస్తుగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కల్పించారు. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి మాత్రమే దర్శనాలు కల్పిస్తున్నారు. భక్తుల భద్రత కోసం శబరిమల మార్గాల్లో, సన్నిధానం వద్ద అదనపు పోలీసు బలగాలను, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు.
మకరజ్యోతి జనవరి 14వ తేదీ మధ్యాహ్నం 3.13 గంటలకు
శబరిమల ఆలయానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నాంబలమేడులో కనిపించే దివ్య జ్యోతిని మకరజ్యోతి లేదా మకర విళక్కు అని పిలుస్తారు. మకరజ్యోతిని ఆ రోజు సాయంత్రం మూడుసార్లు దర్శనమిస్తుంది. భక్తులు దీనిని దైవ దర్శనంగా భావిస్తారు. పవిత్రమైన జ్వాల దర్శనం చేసుకుంటే మనశ్శాంతి, భక్తిభావం బలపడుతుందని భక్తులు నమ్ముతారు.
మకరజ్యోతి దర్శనం శబరిమల తీర్థయాత్ర ముగింపును సూచిస్తుంది. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు జ్యోతి దర్శనానికి వస్తుంటారు. మకర సంక్రాంతి నాడు జరిపే ఈ వేడుక సూర్యుని ఉత్తర దిశగా ప్రయాణాన్ని సూచిస్తుంది.
Also Read: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు బిగ్ అలర్ట్.. అటువైపు వెళ్లొద్దని హెచ్చరిక
మకరజ్యోతి దర్శనానికి పెద్ద సంఖ్య భక్తులు వస్తుండడంతో.. కాలినడక మార్గాల్లో రద్దీ పెరుగుతోంది. దీంతో కేరళ ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. నీలక్కల్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలను ఉపయోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా పంబా వరకు ప్రయాణించాలని సూచించారు. భక్తులు ప్రయాణ ప్రణాళికలను సరిచేసుకుని పోలీసుల సూచనలను పాటించాలన్నారు. ట్రాఫిక్ ఆంక్షలతో పాటు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసినట్లు కేరళ పోలీసులు పేర్కొన్నారు.