మంత్రి వర్గ విస్తరణ కోసం రెక్కలు కట్టుకుని ఢిల్లీలో వాలిపోయారు. కొండా సురేఖ బర్తరఫ్ ఖాయమని ముందే అంచనాలు వేసుకున్న ఆశావహులు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఒక్క కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మినహా.
రాజగోపాల్ రెడ్డి మాత్రం ఇక్కడే ఉంటూ తిట్టినట్టు కాకుండా మెచ్చుకున్నట్టు కూడా కాకుండా.. మధ్యే మార్గంగా తనదైన శైలిలో అధిష్టానాన్ని బెదిరించే దోరణిలోనే మాట్లాడుతూ పర్యటనలు చేస్తున్నారు.
సీఎం అయ్యే చాన్స్ వచ్చినా వస్తుంది… ఆ సమయమే వస్తే నన్నెవరూ ఆపలేరంటూ.. ఏమాత్రం తగ్గడం లేదు. పైగా తనకు ఎలాంటి పదవులు వచ్చినా అవి పేద ప్రజల బాగు కోసమేనంటూ చెబుతూ వస్తున్నారు. అయితే తనకు మంత్రి పదవి ఇవ్వండి.. మాట ఇచ్చారు కదా? అనే ప్రశ్నలు ఇప్పుడు సంధించడం లేదు.
ఈ ముచ్చట అటు పక్కన బెడితే .. విజయశాంతి, స్పీకర్ గడ్డం ప్రసాద్కుకమార్, ఆది శ్రీనివాస్, మల్రెడ్డి రంగారెడ్డి.. ఇలా ఆశావహులు ఢిల్లీ పీఠం చుట్టూ తిరుగుతున్నారు. ఎవరి ఫైరవీలు వారు చేసుకుంటున్నారు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు.. సమయం దగ్గర పడుతుంది.. చూస్తుంటే పుణ్యకాలం కాస్త పూర్తయ్యేటట్టే ఉంది.. అని అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు త్వరపడుతున్నారు. తహతహలాడుతున్నారు.
కానీ అధిష్టానం మాత్రం మంత్రివర్గ విస్తరణకు సుముఖంగా లేదు. ఈ విషయాన్ని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఇవాళ క్లారిటీ ఇచ్చారు. కొండా బర్తరఫ్ ఉదంతంలో విస్తరణ ముచ్చట ఎందుకు? అని ఆయన నర్మగర్భంగా మాట్లాడిన మాటలు.. ఇక ఇప్పట్లో మంత్రి వర్గ విస్తరణ ఉండదనే సంకేతాలే ఇచ్చాయి.
అందుకే కొండా బర్తరఫ్, బీసీ మహిళా మంత్రి ఇష్యూను రాజకీయం చేయొద్దనే ఓ వ్యూహంలో భాగంగా బీసీ మహిళలకు వివిధ పదవులిచ్చి బ్యాలెన్స్ చేశారనరేది లేటుగా అర్థమైంది ఆశావహులకు. దీంతో ఈసారీ ఊసురుమనిపించారని పెదవి విరుస్తున్నారు. ఇక మరో రెండు, మూడు నెలల దాకా మంత్రివర్గ విస్తరణ ఊసే ఉండదనే సంకేతాలు వారికి అందుతున్నాయి.
ఎంతెంత దూరం ఇంకెంత దూరం..? అన్నట్టుగానే మంత్రివర్గ విస్తరణ కోసం ఎదురు చూపులు ఆగడం లేదు. కానీ అప్పటి వరకు టర్ము పూర్తయ్యే పరిస్థితి ఏర్పడితే కూడా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు కొందరు కాంగ్రెస్ నేతలు.