Revanth Reddy: స్వేచ్ఛ బ్యూరో: కొండా సురేఖ ఫ్యామిలీ ఎపిసోడ్ లో సీఎం రేవంత్ రెడ్డి తనదే పై చేయిగా నిలిచారు. రెండు వారాలుగా ఉత్కంఠ రేపిన విమర్శలు, నోటీసులు,అధిష్ఠానం వద్ద పంచాయితీలకు ఎట్టకేలకు తెరపడింది. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తూ నిర్ణయం తీసుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ, ప్రభుత్వంలో మరింత పట్టు లభించినట్లైంది. గవర్నర్కు అధికారిక ప్రతిపాదన పంపడం ద్వారా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీపైనా తనకే పూర్తి స్థాయి పట్టు ఉందనే స్పష్టమైన సంకేతాన్ని సీఎంగా రేవంత్ రెడ్డి పొలిటికల్ సర్కిళ్లకు పంపించారు. మంత్రిగా ఉన్నందున కొండా సురేఖపై చర్యలు తీసుకోవడం అసంభవం అనే చర్చ సొంత పార్టీలోనూ జరిగింది. వివిధ పొలిటికల్ సర్కిళ్లలోనే ఇదే సవాల్ లు వినిపించాయి.
బీసీ సంఘాల నాయకులు కూడా సీఎంకు హెచ్చరికలు జారీ చేశారు. సీఎంకు బర్తరఫ్ చేసే దమ్ము లేదనే పరుష పదజాలంతో కొందరు విమర్శలు కూడా చేశారు. కానీ సీఎం ఇచ్చిన షాక్తో అందరూ అవాక్కయ్యారు. ఇక ఈ వివాదంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు ద్వారా కాంగ్రెస్ శ్రేణులకు ఆయన స్పష్టమైన సంకేతాలు పంపారు. మంత్రి వర్గంలో హోదా, సీనియారిటీ ఉందనే కారణంతో క్రమశిక్షణారాహిత్యాన్ని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. పార్టీ అధిష్ఠానాన్ని ఒప్పించి తన నిర్ణయాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో రేవంత్ రెడ్డి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. దీని ద్వారా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల ముందర, పార్టీ కేడర్పై తన ఆధిపత్యాన్ని, పార్టీ కంట్రోల్ను సీఎం మరింత బలోపేతం చేసుకున్నారు.
Also read: ట్రెండీ కలర్, టెర్రిఫిక్ ఫీచర్స్.. పాకెట్ ఫ్రెండ్లీ ధరలో బోల్ట్ Z60 పింక్ ఇయర్బడ్స్!
మంత్రి కొండా సురేఖను తప్పించిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత, విమర్శలు రాకుండా మరో ముగ్గురు బీసీ మహిళా నేతలకు కీలక పదవులు ఇచ్చారు. సురేఖపై చర్యలతో పాటు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా జి.చిన్నా రెడ్డి నియామకాన్ని రద్దు చేసి,తక్షణమే బీసీ,మహిళా నాయకులకు ప్రాధాన్యం ఇస్తూ కొత్త బాధ్యతలు అప్పగించారు. గద్వాల విజయలక్ష్మీకి తెలంగాణ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్పర్సన్ గా, నేరెళ్ల శారదకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా, జి. సుధారాణికి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్గా ఛాన్స్ ఇస్తూ సీఎం పొలిటికల్ ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేశారు. దీని వలన బీసీల నుంచి ప్రభుత్వానికి వచ్చే విమర్శలు కాస్త తగ్గుతాయనేది సీఎం భావన.
ఇక సీఎంగా రేవంత్ కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటికీ కొంత మంది పాత కాంగ్రెస్ నేతలకు సమన్వయం లేదు. దీంతో నిత్యం అసంతృప్తులు రగులుతూనే ఉన్నాయి. పదవులు, పార్టీ విషయాల్లో ప్రాధాన్యత లభించడం లేదని అప్పప్పుడు కొందరు ముఖ్యనేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. దీనిపై ఇన్నాళ్ల పాటు సీరియస్ గా తీసుకోని సీఎం..ఈ దఫా ఛాలెంజ్ గా తీసుకున్నారు. దీనిలో భాగంగానే తాను సోదరిగా భావించే కొండా సురేఖపై కూడా వేటు వేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ ఎపిసోడ్ తో సీఎం రేవంత్ కు హైకమాండ్ లో అందరికీ కంటే ఎక్కువగా పట్టుఉన్నదనే సంకేతాలను లీడర్లు, కేడర్ కు పంపించారు.
Also read: కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!