Mysore Accident: పెళ్లయిన కొత్తలో ఆ దంపతుల కళ్లల్లో ఎన్నో ఆశలు, గుండెల్లో మరెన్నో కలలు ఉంటాయి. కానీ, విధి ఆడిన వింత నాటకంలో ఒకరిని ఒకరు విడిచిపెట్టాల్సి వచ్చింది. పెళ్లయిన కేవలం 15 రోజుల్లోనే ఓ నవవధువు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కర్ణాటకలోని మైసూరులో చోటుచేసుకుంది. ఆషాఢ మాసం సందర్భంగా భార్యను పుట్టింటికి తీసుకెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది.
అడ్డొచ్చిన అడవి పంది.. అల్లకల్లోలమైన సంసారం
మైసూరు పరిసర ప్రాంతంలో ఈ దంపతులు బైక్పై ప్రయాణిస్తుండగా ఈ దారుణం జరిగింది. ప్రయాణం సాఫీగానే సాగుతున్న సమయంలో అకస్మాత్తుగా ఒక అడవి పంది రోడ్డుపైకి దూసుకొచ్చింది. బైక్ వేగంగా ఉండటంతో, దాన్ని తప్పించే క్రమంలో భర్త అదుపు కోల్పోయాడు. దీంతో బైక్ ఒక్కసారిగా రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న నవవధువు మేఘనతో పాటు ఆమె భర్త కూడా రోడ్డుపై పడిపోయారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ..
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, తీవ్రంగా గాయపడిన దంపతులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, తలకు తీవ్రమైన గాయాలు కావడంతో మేఘన పరిస్థితి విషమించింది. వైద్యులు ఆమెను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ మేఘన కన్నుమూసింది. ఆమె భర్త ప్రస్తుతం ఆసుపత్రిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.
ఆషాఢం తెచ్చిన ఆవేదన
మన సాంప్రదాయం ప్రకారం పెళ్లయిన మొదటి ఏడాది ఆషాఢ మాసంలో కొత్త కోడలిని పుట్టింటికి పంపించడం ఆనవాయితీ. అదే ఆనందంతో భార్యను పుట్టింటికి దింపేందుకు భర్త బైక్ పైన బయలుదేరాడు. కానీ, పుట్టింటికి చేరాల్సిన వధువు, ఊహించని విధంగా కాలగర్భంలో కలిసిపోవడాన్ని బంధువులు, స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటనతో అటు పుట్టిన ఇల్లాలు, ఇటు మెట్టిన ఇల్లాలు ఇరువైపులా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
Also Read: నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..