UGC Regulations: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) తాజాగా ‘ఈక్విటీ’ నిబంధనలు ప్రకటించింది. ఈ నియమావళి వివాదానికి దారితీసింది. దిల్లీలోని యూజీసీ భవనం ఎదుట విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. ఈ చట్టం ఎవరినీ వివక్షకు గురిచేయదన్నారు. ఈ నిబంధనలు ఉన్నత విద్యా రంగంలో పారదర్శకతను, సామాజిక న్యాయాన్ని తీసుకొచ్చేందుకు సహాయపడతాయన్నారు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC)పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో కుల వివక్షను నివారించడానికి చట్టబద్ధమైన సంస్థ రూపొందిస్తూ.. యూజీసీ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనిపై అగ్ర వర్ణ వర్గాల విద్యార్థులు ఆందోళన దిగారు. ఉన్నత విద్యా సంస్థలలో ‘ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్’ (EOC) ఏర్పాటు చేయడం తప్పనిసరి అని నిబంధనలు చెబుతున్నారు. ఈ కమిటీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, దివ్యాంగులకు ప్రాతినిధ్యం కల్పించారు. ఇవి విద్యార్థులకు విద్య, ఆర్థికపరమైన మార్గనిర్దేశం చేస్తాయి. ఈ కమిటీలు సివిల్ సొసైటీ, పోలీసులు, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటారు. కుల వివక్ష గురైతే వారికి న్యాయ సహాయం అందిస్తారు. యూజీసీ కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ నిబంధనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జనరల్ కేటగిరీకి విద్యార్థులు ఆందోళనలకు దిగారు.
జనవరి 13న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈక్విటీ ప్రమోషన్ నిబంధనలు-2026ను నోటిఫై చేసింది. దీంతో 2012 వివక్షత నిబంధనలను సవరించింది. కొత్త నియమాలు “కుల ఆధారిత వివక్ష”ను షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతుల (OBC) సభ్యులపై “కులం లేదా తెగ ఆధారంగా మాత్రమే” వివక్షగా నిర్వచించింది. ఈక్విటీ అంటే హక్కులు, అవకాశాలను అన్ని వర్గాలకు సమాన స్థాయిలో అందించాలని తెలిపింది. ఈ మేరకు ఈక్విటీ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటిలీ వివక్షకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరిస్తాయి. ఈక్విటీ స్క్వాడ్లు హాస్టళ్లు, డిపార్ట్మెంట్లు, లైబ్రరీలలో ఈక్విటీ అంబాసిడర్స్ గా వ్యవహరిస్తారు.
కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో హెల్ప్లైన్లను ఏర్పాటు చేయడం, పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయడం.. యూజీసీకి క్రమం తప్పకుండా నివేదించడం వీటి పని.
ఈ నిబంధనల అమలు చేయడంపై వైస్-ఛాన్సలర్లు, ప్రిన్సిపాల్లు, డిపార్ట్మెంట్ హెడ్స్ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. నిబంధనలను పాటించేలా చేయడం, యూజీసీకి నివేదికలను సమర్పించడం వీరి బాధ్యత.