Cyber Fraud: నూతన సంవత్సరం సందర్భంగా వాట్సాప్లో వస్తున్న గ్రీటింగ్స్, డిస్కౌంట్ ఆఫర్లు, క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ పేరుతో సైబర్ మోసాలు భారీగా పెరుగుతున్నాయి. న్యూ ఇయర్ ఆఫర్, స్పెషల్ గిఫ్ట్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ అంటూ వచ్చే లింకులు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నా, ఇవి పూర్తిగా నకిలీవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, గ్రూప్లలో నుంచి వచ్చే మెసేజ్లు కావడంతో అనుమానం లేకుండా క్లిక్ చేసే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ అలవాటే సైబర్ నేరగాళ్లకు ప్రధాన టార్గెట్ మారింది.
వాట్సాప్ అకౌంట్ పూర్తిగా హ్యాక్
ఈ లింకులపై క్లిక్ చేసిన వెంటనే ఫోన్లో మాలిషియస్ APK సైలెంట్గా ఇన్స్టాల్ అవుతుంది. యూజర్కు తెలియకుండానే ఈ APK బ్యాక్గ్రౌండ్లో పని చేస్తూ OTPలు, బ్యాంక్ మెసేజ్లు, వ్యక్తిగత డేటాను చదవడం మొదలుపెడుతుంది. కొన్ని సందర్భాల్లో వాట్సాప్ అకౌంట్ను పూర్తిగా హ్యాక్ చేసి, బాధితుడి పేరుతోనే ఇతరులకు స్కామ్ లింకులు పంపుతుంది. ఇలా ఒకరి ఫోన్ హ్యాక్ అయితే, అదే అకౌంట్ ద్వారా మొత్తం కాంటాక్ట్స్ ప్రమాదంలో పడే పరిస్థితి వస్తోంది.
లింకులు ఎక్కువగా కుటుంబం, స్నేహితుల ద్వారానే ఫార్వర్డ్
పోలీసులు గమనించిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ స్కామ్ లింకులు ఎక్కువగా కుటుంబ గ్రూపులు, స్నేహితుల గ్రూపుల ద్వారానే ఫార్వర్డ్ అవుతున్నాయి. తెలిసిన వారి నుంచి వచ్చిన మెసేజ్ కావడంతో మిగతావారు కూడా నమ్మి క్లిక్ చేస్తున్నారు. న్యూ ఇయర్ సెలవుల సమయంలో ఆనందం, ఆఫర్లపై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో జాగ్రత్త తగ్గుతోంది. ఇదే సమయంలో డిజిటల్ పేమెంట్స్, ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా ఉండటం వల్ల సైబర్ నేరగాళ్లకు అవకాశాలు పెరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.
వెంటనే 1930కు కాల్ చేయండి
ఇలాంటి మోసాల నుంచి రక్షణ పొందాలంటే వాట్సాప్ Two-Step Verification తప్పనిసరిగా ఆన్ చేయాలి. మెసేజింగ్ యాప్స్ ద్వారా వచ్చే లింకులు, యాప్ ఫైళ్లను ఎప్పటికీ ఇన్స్టాల్ చేయకూడదు. బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు వాట్సాప్ ద్వారా ఆఫర్లు ఇవ్వవని గుర్తుంచుకోవాలి. ఏదైనా సైబర్ మోసం జరిగితే వెంటనే 1930కు కాల్ చేయాలి, ఆలస్యం చేయకుండా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలి. నూతన సంవత్సరం ఆనందంగా ఉండాలంటే అప్రమత్తతే అసలైన భద్రత అని పోలీసులు సూచిస్తున్నారు. అందుకని అనవసర లింక్ లను క్లిక్ చేయకుండా మీ న్యూయర్ను హ్యాపీగా జరుపుకోవాలని తెలుపుతున్నారు.