Whatsapp : గత కొంత కాలంగా సైబర్ క్రైమ్లు ఎక్కువగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. నకిలీ లింక్, సందేశాలను పంపి, యూజర్స్ను ఆకర్షితులయ్యేలా చేసి వారిని బురిడి కొట్టిస్తున్నారు. వారి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి డబ్బులును కొల్లగొట్టేస్తున్నారు. లేదంటే వారి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి ఫ్రాడ్ యాక్టివిటీస్ లేదా ఫైనాన్షియల్ స్కామ్స్ చేస్తున్నారు.
అలా ఇప్పుడు విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఫ్రీ ల్యాప్టాప్ స్కీమ్ పేరుతో వాట్సాప్లో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. అవగాహనం లేకుండా ఫ్రీ ల్యాప్టాప్కు ఆశపడి ఆ మెసేజ్ను క్లిక్ చేస్తే అంతే సంగతులు. పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ఫ్యాక్ట్ చెక్ ప్రకారం ఫ్రీ ల్యాప్టాప్ స్కీమ్ మెసేజ్ జెన్యూన్ కాదు. అందుకే పీఐబీ ఇలాంటి మెసేజ్ వస్తే దానిపై క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
మెసేజ్లో ఏముంటుందంటే? – ఆ మెసేజ్లో స్టూడెంట్స్ను ఆకర్షితులను చేయడం కోసం ఫ్రీ ల్యాప్టాప్ స్క్రీమ్ గురించి ఉంటుంది. అందులో వారి పర్సనల్ డేటాతో పాటు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఫిల్ చేయమని ఓ ఫామ్ కూడా ఉంటుంది. దీని ద్వారా డేటాను కలెక్ట్ చేసి ఫ్రాడ్ యాక్టివిటీస్ లేదా ఫైనాన్షియల్ స్కామ్స్లో ఆ డేటాను ఉపయోగిస్తారు.
అసలు ఫ్రీ ల్యాప్ స్క్రీమ్ మెసేజ్ ఏంటంటే? – ఆర్థికంగా స్థోమత లేని విద్యార్థుల కోసం ఫ్రీ ల్యాప్ స్కీమ్ 2024ను ప్రారంభించారు. దీని ద్వారా 2024లో దాదాపు 96000కుపైగా విద్యార్థులకు ఫ్రీ ల్యాప్టాప్స్ ఇచ్చారు. ఇప్పటికే అప్లై చేసిన చాలా మందికి ల్యాప్టాప్స్ కూడా లభించాయి. అయితే ఇదే సమయంలో దీని అదునుగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కూడా ఈ స్కీమ్ పేరుతో ఫేక్ లింక్ను పంపి వ్యక్తిగత డేటాను కలెక్ట్ చేస్తున్నారు.
అందుకే పీఐబీ, యూజర్స్ను అనుమానస్పద లింక్స్పై క్లిక్ చేయొద్దని, సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచనలను జారీ చేసింది. అలానే పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.
ఇలాంటి స్కామ్ల బారిన పడకుండా ఉండేందుకు ఏం చేయాలంటే? – గవర్నమెంట్ స్కీమ్స్ – ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్స్ అని మెసేజ్లు, ఈమెయిల్స్, బ్యానర్స్ లేదా లింక్లు వస్తే ముందుగా వాటిని వెరీఫై చేసుకోవాలి. అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్లో వాటి గురించి వివరాలు ఉన్నాయా లేదా అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేయాలి. అన్వెరీఫైడ్ సోర్సెస్ నుంచి వచ్చిన వాటిని అస్సలు నమ్మకూడదు. అధికారిక ప్రభుత్వ వెబ్సైట్స్ నుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే నమ్మాలి. వాటినే పరిగణలోకి తీసుకోవాలి.
పర్సనల్ ఇన్ఫర్మేషన్ – అస్సలు ఎవరికీ కూడా, మరీ ముఖ్యంగా అన్వెరీఫైడ్ సోర్సెస్, మెసేజెస్కు బ్యాంక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇతర వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయకూడదు.
మాల్వేర్ లింక్స్ – అన్వెరీఫైడ్ మెసేజెస్ మాల్వేర్ లింక్స్ను కలిగి ఉంటాయి. ఒకవేళ దానిపై క్లిక్ చేస్తే, అందులో ఉన్న వైరస్ మన డివైసెస్లోకి ఇన్స్టాల్ అయిపోతుంది. దీంతో స్కామర్స్కు మన పర్సనల్ డేటా, లాగిన్స్, బ్యాంక్ సహా ఇతర సమాచారం సులభంగా దొంగిలించేందుకు వీలుకలగుతుంది.
కాబట్టి ప్రతిఒక్క విద్యార్థి సహా ఇతరులు.. అనుమానస్పద, ఫేక్ లింక్స్, మెసేజ్స్, వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
ALSO READ : షాక్ ఇచ్చిన ఐఫోన్ 15 ప్లస్… ఫ్లిప్కార్ట్ లో ఒక్కరోజే రూ.15వేల తగ్గింపు