Jamun Seeds Powder: అనేక పోషకాలను కలిగి ఉన్న నేరేడు పండ్లు ప్రస్తుత సీజన్లో దొరక్కపోవచ్చు కానీ.. విత్తనాల పొడి దొరుకుతుంది. మన ఆరోగ్యానికి నేరేడు పండ్లే కాదు.. నేరుడు గింజల పొడి కూడా అద్భుతమైన ఔషధం. వీటిని కూడా ఒక మూలికగా పరిగణిస్తారు వైద్య నిపుణులు. ఆయుర్వేదంలో ఈ విత్తనాలను పలు ఔషధాల తయారీకి కూడా ఉపయోగిస్తారు. నేరేడు విత్తనాల పొడితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పలు వ్యాధులను నయం చేసుకునేందుకు ఈ పొడి బాగా పనిచేస్తుంది.
నేరేడు విత్తనాల పొడిని మధుమేహం ఉన్నవాళ్లు తీసుకుంటే.. షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఈ పొడిని భోజనానికి ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తాగాలి. ఈ పొడిలో జంబోలైన్, జంబోసైన్ అనే సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్ను తగ్గిస్తాయి. ప్రతిరోజూ తీసుకోవడం వల్ల శరీరం ఇన్సులిన్ను మెరుగ్గా పొందగలదు. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి కూడా నేరుడు విత్తనాల పొడి ఎంతో మేలు చేస్తుంది. దీంతో అతిదాహం, అతి మూత్ర విసర్జన వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.
శరీరంలో ఏవైనా వాపులు ఉంటే.. నేరేడు విత్తనాల పొడిని తీసుకోవడం వల్ల తగ్గిపోతాయి. నేరేడు గింజల పొడి యాస్ట్రింజెంట్ గుణాలను కలిగి ఉంటుంది కాబట్టి.. ముఖ్యంగా పేగుల్లో వచ్చే వాపులు తగ్గుతాయి. ఈ పొడితో విరేచనాల నుంచి బయటపడొచ్చు. దీంతోపాటు జీర్ణాశయం, పేగుల్లో ఉండే అల్సర్లు నయమవుతాయి. ఈ విత్తనాల పొడిలో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల.. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ను తొలగిస్తాయి. దీనివల్ల రక్త నాళాల వాపులు తగ్గి, గుండె జబ్బులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారికి.. నేరేడు విత్తనాల పొడి ఎంతో మేలు చేస్తుంది. లివర్లో ఉండే వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. అలాగే ఈ పొడిని రోజూ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సీజనల్గా వచ్చే చిన్న చిన్న సమస్యలకు చెక్ పెట్టవచ్చు. నేరేడు గింజల పొడిని రోజుకు 1 నుంచి 2 టీస్పూన్ల మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని నీళ్లు లేదా మజ్జిగలో కలిపి తాగవచ్చు.