Recharge Prices Fall: నిత్యం పెరుగుతున్న మొబైల్ రీఛార్జ్ ఛార్జీలతో విసిగిపోయిన సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక మంచి తీపి కబురు అందించేందుకు సిద్ధమవుతోంది. దేశంలో కోట్లాది మంది మొబైల్ వినియోగదారులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఒక భారీ ప్రణాళికను రూపకల్పన చేసింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) వంటి ప్రధాన టెలికాం కంపెనీల రీఛార్జ్ ప్లాన్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
మొబైల్ సేవల ధరలను తగ్గించడం కోసం టెలికాం రంగంపై ఉన్న పన్నులు, ఇతర రుసుములను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. టెలికాం మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రభుత్వం ప్రధానంగా రెండు అంశాలపై దృష్టి సారించింది. అవి ఏంటంటే..
ప్రస్తుతం భారతదేశంలోని టెలికాం కంపెనీలు తమ మొత్తం ఆదాయంలో (AGR) సుమారు 8 శాతాన్ని లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తున్నాయి. ఈ 8 శాతం ఫీజును 3 నుండి 4 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల టెలికాం కంపెనీలకు భారం తగ్గి భారీగా నిధులు ఆదా అవుతాయని అభిప్రాయపడుతోంది. అదే జరిగితే ఆ ప్రయోజనాన్ని కంపెనీలు నేరుగా తమ వినియోగదారులకు తక్కువ ధరల రూపంలో అందించే అవకాశం ఉంటుంది.
మరోవైపు టెలికాం కంపెనీలు చెల్లించే 8 శాతం రుసుములో 5 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల విస్తరణకు కేటాయించే ప్రభుత్వ నిధికి (USOF) వెళ్తుంది. అయితే, ప్రస్తుతం ఈ ఫండ్లో ఇప్పటికే భారీ మొత్తంలో నిధులు జమ అయి ఉన్నాయి. దీంతో రాబోయే కొన్ని సంవత్సరాల పాటు ఈ 5 శాతం రుసుము వసూలును పూర్తిగా నిలిపివేయడం లేదా బాగా తగ్గించడంపై ప్రభుత్వం సమీక్ష చేస్తోంది.
గత జూలై నెలలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు తమ టారిఫ్ ధరలను ఒకేసారి 15 నుండి 25 శాతం వరకు పెంచాయి. దీనివల్ల సాధారణంగా వాడే 28 రోజులు, 56 రోజులు, 84 రోజుల కాలపరిమితి ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు బాగా ప్రియమయ్యాయి. ఈ ఛార్జీల పెంపు ప్రభావం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, పేద-దిగువ మధ్యతరగతి ప్రజలపై తీవ్రంగా పడింది. కేవలం కాలింగ్, ప్రాథమిక ఇంటర్నెట్ కోసం మొబైల్ వాడే చాలామంది యూజర్లు రీఛార్జ్ చేసుకోవడం తగ్గించడమే కాకుండా సెకండరీ సిమ్ కార్డ్ సేవలను కూడా నిలిపివేశారు. ఈ అంశంపై పార్లమెంట్ నుంచి సోషల్ మీడియా వరకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ టెలికాం నియంత్రణ సంస్థ (TRAI), కంపెనీలతో కలిసి మధ్యస్థ మార్గాన్ని అన్వేషించేందుకు ప్రభుత్వం ఈ ప్రణాళికను సిద్ధం చేసింది.
Also Read: దీదీకి దెబ్బ మీద దెబ్బ.. నందిగ్రామ్ తర్వాత రెజీనగర్లోనూ షాక్!
ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా పన్నులు, ఫీజుల తగ్గింపు అమలైతే కంపెనీలు తమ ప్రస్తుత ప్లాన్ల ధరలను 10 నుండి 15 శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు ప్రస్తుతం రూ.299 గా ఉన్న నెలవారీ రీఛార్జ్ ప్లాన్ ధర రూ.250 నుండి రూ.260 కి తగ్గే అవకాశం ఉంది. అలాగే సంవత్సర కాలపరిమితి ఉండే వార్షిక ప్లాన్లపై వినియోగదారులకు రూ.300 నుండి రూ.400 వరకు ఆదా అయ్యే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చితే సామాన్య ప్రజల జేబుకు పెద్ద ఉపశమనం లభించినట్లేనన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.
Also Read: బాంబు పేల్చిన పెట్రోల్ బంక్ డీలర్లు.. యూపీఐ చెల్లింపులు నిలిపివేత.. ఆ తేదీ నుంచి క్యాష్ తప్పనిసరి!