Smartphone Overheating Tips: వాతావరణంలో తీవ్రమైన మార్పుల వలన వర్షాలు కురవాల్సిన సమయంలో.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండల దెబ్బకు మనుషులే కాదు.. మన చేతిలో ఉండే స్మార్ట్ఫోన్లు కూడా విపరీతంగా వేడెక్కుతున్నాయి. కొద్దిసేపు వాడినా లేదా కొద్దిగా ఎండ తగిలినా ఫోన్ హీటెక్కిపోతోంది. దీంతో వాటిని ఎలాగైనా చల్లబరచాలనే ఆరాటంలో చాలామంది వింత వింత ప్రయోగాలు చేస్తున్నారు.
స్మార్ట్ఫోన్ ఓవర్ హీట్ అయినప్పుడు దాన్ని వెంటనే ఫ్రిడ్జ్లో లేదా ఫ్రీజర్లో పెడితే నిమిషాల్లో చల్లబడుతుందంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ తప్పుడు చిట్కాలను నమ్మి చాలామంది తమ ఫోన్లను ఫ్రిడ్జ్లలో పెట్టేస్తున్నారు. దీనివల్ల రిపేర్ షాపులకు కస్టమర్ల రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది.
వేడిగా ఉన్న ఫోన్ను ఒక్కసారిగా చల్లని ఫ్రిడ్జ్లో ఉంచినప్పుడు కండెన్సేషన్ (ఆవిరి నీరుగా మారడం) ప్రక్రియ జరుగుతుంది. ఫోన్ లోపల ఉండే గాలి చల్లబడి, నీటి బిందువులుగా మారిపోతుంది. అలాగే ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసినప్పుడు కూడా వాతావరణంలోని వేడి గాలి తగిలి ఫోన్ లోపల, బయట తేమ పేరుకుపోతుంది. ఈ తేమ వల్ల ఐసీలు షార్ట్ సర్క్యూట్ అయి ఫోన్ పూర్తిగా పాడైపోతుంది.
Also Read: రూ.1500 లోపు నోరువెళ్లబెట్టే ఫీచర్లు.. ఏకంగా 75 గంటల బ్యాటరీతో కొత్త ఇయర్బడ్స్ లాంచ్!
తీవ్రమైన ఉష్ణోగ్రత మార్పుల వల్ల ఫోన్ డిస్ప్లే, గ్లాస్, లోపల ఉండే గ్లూ దెబ్బతింటాయి. అన్నిటికంటే ముఖ్యంగా బ్యాటరీపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇటీవల ఒక రిపేర్ షాపులో ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి తెచ్చిన ఐప్యాడ్ బ్యాటరీ ఉబ్బిపోయి, చూస్తుండగానే పేలిపోయింది. అందుకే ఈ ప్రయోగాలు ప్రాణాలకే ప్రమాదకరంగా మారుతున్నాయి.
ఫోన్ నీళ్లలో పడితే బియ్యం డబ్బాలో పెట్టాలనే పాత చిట్కా ఎంతటి అబద్ధమో.. ఈ ఫ్రిడ్జ్ చిట్కా కూడా అంతేనని నిపుణులు చెబుతున్నారు. బియ్యం వల్ల ఫోన్ లోపలి తడి ఆరకపోగా.. ఆ బియ్యపు పిండి, ధూళి చార్జింగ్ పోర్టుల్లోకి చేరి మరింత నష్టం చేస్తాయి.
యాపిల్, శాంసంగ్ వంటి దిగ్గజ సంస్థలు కూడా తమ ఫోన్లు వేడెక్కినప్పుడు వాటిని సహజంగానే చల్లబరచాలని సూచిస్తున్నాయి. ఫోన్ హీటెక్కినప్పుడు దాన్ని ఎండ తగలకుండా నీడలో ఉంచాలి. వీలైతే కాసేపు స్విచ్ఛాఫ్ చేసి ఫ్యాన్ గాలి కింద పెట్టాలి. అంతే తప్ప ఇలాంటి వెర్రి చిట్కాలను ఫాలో అయ్యి డబ్బులు వృధా చేసుకోకూడదు.
Also Read: OnePlus 15 యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ ఒక్క అప్డేట్తో ఇక డబుల్ ధమాకా!