Sunita Williams16 sunrises | భారత మూలాలు గల అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ గత కొన్ని నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకొని ఉన్నారు. అయితే ఆమె ప్రస్తుతం అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) లో సురక్షితంగానే ఉన్నారు. ఈ క్రమంలో ఆమె క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు అక్కడే జరుపుకున్నారు. అక్కడ ఆమెకు ప్రతి రోజు 16 సార్లు సూర్యోదయం చూస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే సునీతా విలియమ్స్ తో పాటు అక్కడ ఉన్న అందరూ వ్యోమగాములు న్యూ ఇయర్ వేడుక సందర్భంగా జనవరి 1, 2025న 16 సూర్యోదయాలు వీక్షించారు. అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా శాస్త్రవేత, వ్యోమగామి అయిన సునీతా విలియమ్స్ ప్రస్తుతం నాసా ‘ఎక్స్పెడిషన్ 72’ కి కమాండర్ గా వ్యవహరిస్తున్నారు. స్పేస్ స్టేషన్ లో ప్రస్తుతం ఆమెతో పాటు అలెక్సిలీ ఓవ్చినిన్, బుచ్ విల్మోర్, డాన్ పెటిట్, అలెక్సాండర్ గోర్బునోవ్, నిక్ హేగ్ లాంటి స్పేస్ ఫ్లైట్ ఇంజినీర్లు ఉన్నారు. వీరంతా ఎక్స్పెడిషన్ 72 సిబ్బంది.
“2024 సంవత్సరం ముగిసింది. అంతరిక్షంలో ప్రతిరోజూ లాగే ఎక్స్పెడిషన్ 72 సిబ్బంది ఈ రోజు కూడా న్యూ ఇయర్ సందర్భంగా 16 సార్లు సూర్యుడు ఉదయించడం, 16 సార్లు అస్తమించడాన్ని చూశారు. ఆర్బిటల్ అవుట్ పోస్ట్ లో ఉంటూ ఏళ్ల తరబడి నుంచి చాలా సూర్యాస్తమయాల చిత్రాలు తీయడం జరిగింది.” అని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ అధికారికంగా ఎక్స్ లో ట్వీట్ చేసింది.
Also Read: 2025 ప్రపంచంలో మృత్యు తాండవం.. సిరియా పతనమే పునాది.. బాబా వంగా జోస్యం
అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ భూగ్రహం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా ప్రతిరోజు దాదాపు 15.5 సార్లు భ్రమణం చేస్తూ ఉంటుంది. అంటే గంటకు ఈ స్పేస్ స్టేషన్ 28,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ స్పేస్ స్టేషన్ భూమికి 400 కిలో మీటర్ల ఎత్తులో అంతరిక్షంలో ఉంది. ఒక్కాసరి భూమిని చుట్టేయడానికి ఈ స్పేస్ స్టేషన్ కు 90 నిమిషాలు పడుతుంది.
సునీతా విలియమ్స్ తో పాటు మరో అమెరికా వ్యోమగామి బుచ్ విల్మోర్ జూన్ 2024లో అంతరిక్షంలోకి వెళ్లారు. వారిద్దరూ 8 రోజుల్లో తిరిగి భూమికి చేరుకోవాల్సి ఉండగా.. వారు వెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష విమానంలో టెక్నికల్ సమస్యలు వచ్చాయి. దీంతో వారిద్దరూ అక్కడే కొన్ని రోజుల పాటు నిరీక్షించాలని నాసా నిర్దేశించింది. కానీ కొన్ని రోజులు కాస్తా ఇప్పుడు కొన్ని నెలలుగా మారిపోయింది. వారిని భూమిని తీసుకు వచ్చేందుకు ప్రస్తుతం ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ అంతరిక్ష విమానం.. నాసాకు సాయం చేస్తోంది. వారు మరో మూడు నెలల తరువాత భూమికి తిరిగి వచ్చే అవకాశాలున్నాయి.
అయితే అంతరిక్షంలో ఉంటూనే ఈ వ్యోమగాములు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు నాసా వీలు కల్పిస్తోంది. ఇటీవలే క్రిస్మస్ సమయంలో సునీతా విలియమ్స్ అంతరిక్షంలో తన సహచరులతో కలిసి పండుగ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను నాసా ఎక్స్ లో పోస్ట్ చేసింది.