India NewZealand Cricket Betting| ఆదివారం జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి బుక్కీలు జోరుగా క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. దుబాయ్ లో జరుగునున్న ఫైనల్ మ్యాచ్ లో దాదాపు రూ.5000 కోట్ల బెట్టింగ్ జరిగిందని… ఈ వ్యవహారంలో అండర్వరల్డ్ మాఫియా హస్తం ఉందని సమాచారం.
భారతదేశంలో పాటు ఇతర దేశాలలో క్రికెట్ బెట్టింగ్స్ జరుగుతున్నాయి. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ బుకీలు ఇండియానే ఫేవరెట్ గా పెట్టారు. ఈ అంతర్జాతీయ బుకీలకు అండర్ వరల్డ్ తో సంబంధాలున్నాయని.. వందల కోట్ల బెట్టింగ్ డీల్ చేసే బడా బుకీలంతా ఈ ఫైనల్ మ్యాచ్ కోసం దుబాయ్ లో సమావేశం కానున్నారని సూత్ర ప్రాయంగా తెలిసింది. ఈ బుకీలలో ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ‘డి కంపెనీ’ గ్యాంగ్ కూడా ఉందని సమాచారం.
శనివారం దేశ రాజధాని ఢిల్లీలో క్రైమ్ బ్రాంచ్కు చెందిన పోలీసులు ఛాంపియన్స్ ట్రోఫీ బెట్టింగ్ చేస్తున్నారని అయిదుగురు బుకీలను అరెస్టు చేశారు. ఈ బుకీలంతా సెమీ ఫైనల్స్ బెట్టింగ్ చేశారని ఆధారాలు లభించడంతో వీరిని అదుపులోకి తీసుకొని ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. దీంతో దుబాయ్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ బెట్టింగ్ వ్యవహారమంతా బయటపడింది.
Also Read: ఆ నటుడితో టీమిండియా క్రికెటర్ భార్య రిలేషన్.. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ ?
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం భారీగా బెట్టింగ్ నిర్వహించిన ప్రవీణ్ కొచ్చిర్, సంజయ్ కుమార్ అనే ఇద్దరు బుకీలను పోలీసులు ముందుగా అరెస్ట్ చేశారు. వీరిద్దరూ తమ ల్యాప్ టాప్స్, మొబైల్ ఫోన్స్ లో లైవ్ బెట్టింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి మొబైల్ ఫోన్స్, ల్యాఫ్ టాప్స్ అన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘lucky.com’ అనే క్రికెట్ బెట్టింగ్ ఆన్ లైన్ వెబ్ సైట్ లో ప్రవీణ్ కొచ్చార్ మాస్టర్ ఐడి కలిగి ఉన్నాడని.. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ చేయాలనుకునే వారికి కొత్త ఐడీలు క్రియేట్ చేసి విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఒక్కో బెట్టింగ్ ఈ మాఫియా సిండికేట్ 3 శాతం కమీషన్ తీసుకుంటోందని పోలీసుల విచారణలో తెలిసింది.
దీంతో పాటు ఈ బుక్కీలు ఆఫ్ లైన్ బెట్టింగ్ కోసం ఫోన్ కాల్స్ ద్వారా పెద్ద బెట్టింగ్ ఆర్డర్లు తీసుకొని.. వాటిని నోట్ ప్యాడ్ లో బెట్టింగ్ రేట్స్ ఎంట్రీ చేస్తున్నట్లు తెలిసింది. ఈ బెట్టింగ్ బిజినెస్ నడిపేందుకు ఢిల్లీలో ప్రవీణ్ కొచ్చర్ నెలకు రూ.35,000 రెంటు చెల్లిస్తూ రెండేళ్ల క్రితమే ఒక ఇల్లు తీసుకున్నాడు. ప్రతీ మ్యాచ్ పై ప్రవీణ్ కు రూ.40,000 లాభం వచ్చేది. ఈ బెట్టింగ్ నెట్ వర్క్ అంతా దుబాయ్ బాసులే కంట్రోల్ చేస్తున్నారని ప్రవీణ్ తెలిపాడు.
ప్రవీణ్ తో పాటు వెస్ట్ ఢిల్లీకి చెందిన ఛోటు బన్సల్ అనే బుకీ కెనడా నుంచి ఒక బెట్టింగ్ యాప్ డెవలప్ చేయించాడు. అతను ప్రస్తుతం దుబాయ్ లో నివసిస్తూ ఈ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. అలాగే ఢిల్లీ మోతీ నగర్ కు చెందిన వినయ్ అనే వ్యక్తి కూడా దుబాయ్ లో ఉంటూ అక్కడ క్రికెట్ మాఫియాతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్నాడు. ఢిల్లీ బెట్టింగ్ మాఫియాలో బాబీ, గోలు, నితిన్ జైన్, జీతు అనే ఇతరుల పేర్లు కూడా బుకీల జాబితాలో ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
ఢిల్లీలో అరెస్ట్ అయిన అయిదుగురిలో ముగ్గురు.. మనీష్ సహానీ, యోగేష్, సూరజ్.. దుబాయ్ లో లింకులు కలిగి ఉన్నారు. వీరి వద్ద నుంచి పోలీసులు రూ.22 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరి గ్యాంగ్ లో మనీష్ సహానీ మెయిన్ ఆపరేటర్. ఇతను బడా బెట్టింగ్లను నేరుగా ఆపరేట్ చేస్తున్నట్లు అంగీకరించాడు. బెట్టింగ్ చేసే బడా వ్యక్తుల బ్యాంక్ అకౌంట్లలో లావాదేవీలు చేసేందుకు ఇతని వద్ద పాస్ వర్డ్స్ కూడా ఉన్నాయని తెలిసి పోలీసులు సైతం షాకయ్యారు. క్రికెట్ బెట్టింగ్ తో పాటు నిందితులు ”సట్టా” బెట్టింగ్ యాప్ కూడా ఇండియా బయటినుంచి నడుపుతున్నట్లు తెలిపారు.