Rohit and Kohli Got Emotional After India Won the Semifinal Match with England : ఒక్క సెమీఫైనల్ గెలుపుతో.. ఎన్నో భావోద్వేగాలు టీమ్ ఇండియా ఆటగాళ్లతో దోబూచులాడాయి. ఇద్దరూ లెజండరీ క్రికెటర్లు. ఒకరు సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటే, ఒకరు వైఫల్యంతో మనస్థాపానికి గురయ్యారు. విషయం ఏమిటంటే టీ 20 ప్రపంచకప్ సెమీఫైనల్ పోరులో ఇంగ్లండ్ పై టీమ్ ఇండియా ఘన విజయం సాధించి ఫైనల్ కి దూసుకువెళ్లింది. ఈ సమయంలో డగౌట్ లో కూర్చుని రోహిత్ శర్మ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.
ఆనాడు 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియాపై ఓటమికి ఎంతగా కుంగిపోయాడో, ఆ భావోద్వేగం నేడు కట్టలు తెగి బయటపడింది. ఒక ఆటగాడిగా కాదు.. భారత్ క్రికెట్ కెప్టెన్ గా ఎంత ఒత్తిడి అనుభవిస్తున్నాడనేది అక్కడ స్పష్టంగా అందరికీ కనిపించింది. అయితే ఆటగాళ్లందరూ గ్రౌండు నుంచి వస్తూ.. డగౌట్ లో కూర్చుని భావోద్వేగంతో ఉన్న రోహిత్ ను పలుకరించారు.
అయితే కోహ్లీ మాత్రం దగ్గరికి వచ్చి.. ‘కమాన్ మ్యాన్ చీర్స్’ అనడం అక్కడ కొందరికి వినిపించింది. మిగిలిన ఆటగాళ్లు కూడా రోహిత్ శర్మ అలా ఉండటంతో ఏమీ అనలేక, ఆనందాన్ని మనసులో దాచుకుని తనకి షేక్ హ్యాండ్ లు ఇచ్చి లోనికి వెళ్లారు.
Also Read : బాబూ.. ఎంతో కొంత ఇవ్వండి! పాకిస్తాన్ ఆటగాళ్ల దైన్యం..
ఇదే మ్యాచ్ లో ఫస్ట్ ఇండియా బ్యాటింగ్ చేసినప్పుడు మరో దృశ్యం కనిపించింది. ఇక్కడ రోహిత్ ప్లేస్ లో కొహ్లీ ఉన్నాడు. తను ఓపెనర్ గా వెళ్లి 9 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. దీంతో తీవ్రంగా బాధపడ్డాడు. డగౌట్ లో కూర్చుని అవమానభారంతో, మనస్థాపంతో కుమిలిపోతుంటే హెడ్ కోచ్ ద్రవిడ్ వచ్చి, భుజం మీద చేయి వేసి ఓదార్చాడు.
అయితే కోహ్లీ బాధ ఏమిటంటే, తను ఫెయిల్యూర్ అవుతున్నందుకు కాదు. టీ 20 ప్రపంచకప్ లాంటి మెగా టోర్నమెంటులో తన ప్రాతినిథ్యం లేకపోవడం కొహ్లీని కలచివేస్తోందని సన్నిహితులు పేర్కొంటున్నారు. ఏదైతేనేం ఇద్దరు లెజండరీ క్రికెటర్లు రెండు వేర్వేరు పార్శ్వాలతో బాధపడటం క్రికెట్ ప్రేమికులకు ఆవేదనకు గురి చేసింది. ప్రజలు, క్రికెట్ అభిమానులు అందరూ కూడా వీరు సరిగ్గా ఆడకపోతే దుమ్మెత్తిపోస్తుంటారు. వారు మనుషులే అని, మర మనుషులు కాదని, ఆటలో సహజమైన గెలుపు ఓటములపై అంత తీవ్ర ఒత్తిడి వారిపై పెట్టవదని నెటిజన్లు కోరుతున్నారు.
https://twitter.com/SaffronSunanda/status/1806427520608436607?