E-Paper
Advertisement

BRS MLA’s Met CBN : చంద్రబాబుని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కేసీఆర్ కు షాక్ తప్పదా ?

BRS MLA’s Met CBN : చంద్రబాబుని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కేసీఆర్ కు షాక్ తప్పదా ?

BRS MLA’s Met CBN : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని బద్ధ శత్రువులా చూస్తుంటారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. అందుకే రాష్ట్ర విభజన తర్వాత ప్రతీసారి ఏపీ ఎన్నికల్లో జగన్ సీఎం అవుతారని చిలకజోస్యాలు చెప్తారు. ఇప్పుడు కేసీఆర్ తన పార్టీ ఖాళీ అవుతూ వరుస షాక్‌లు తగులుతుండటంతో ఫాంహౌస్ వదిలి బయటకు రావడం లేదు. అటు చూస్తే నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన సీబీఎన్ తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తెస్తానంటున్నారు. ఆ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లి చంద్రబాబును కలిసి అభినందించి వచ్చారు. దాంతో కేసీఆర్‌కు పుండు మీద కారం చల్లినట్లు అయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును గ్రేటర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రకాషగౌడ్‌, ఆరెకపూడి గాంధీలు జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు.. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టి మొదటిసారి గ్రేటర్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆయన్ని ఘనంగా సన్మానించి, అభినందనలు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబును బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కలవడంపై హాట్ డిబేట్ జరుగుతోంది. 2014లో టీడీపీలో గెలిచి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు అరికెపూడి గాంధీ, ప్రకాష్‌ గౌడ్‌.

తర్వాత పదేళ్లలో ఆ ఎమ్మెల్యేలు చంద్రబాబును ఎప్పుడూ కలవలేదు. దాతో కేసీఆర్‌కు చెప్పే చంద్రబాబుతో గాంధీ, ప్రకాష్‌గౌడ్ భేటి అయ్యారా ? కేసీఆర్‌కు చెప్పేదేంటని చంద్రబాబును కలిశారా..? అన్న చర్చ మొదలైంది. ఈ మధ్య వలసల దెబ్బతో బీఆర్ఎస్ ఖాళీ అవుతుండటంతో గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆదేశాలను పెద్దగా లెక్కచేయడం లేదు. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశానికి గ్రేటర్ పరిధిలోని ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. బల్దియా సమావేశానికి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గైర్హాజరయ్యారు. కౌన్సిల్ మీటింగ్‌కు ఎమ్మెల్యేలు కచ్చితంగా హాజరు కావాలని బీఆర్ఎస్ ఆదేశాలు జారీచేసింది. అధిష్టానం ఆదేశాలను ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు లైట్ తీసుకున్నారు.

Also Read : ఆగని చేరికలు.. ఫలించని వేడుకోలు

దాంతో వారంతా పార్టీ మారతారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఇద్దరు ఎమ్మెల్యేలు చంద్రబాబును కలవడంపై ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ఇప్పటికే.. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలో వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతూ.. రాజకీయ పరిణామాలను పూర్తిగా మార్చేస్తున్నారు. తాజాగా ప్రకాష్‌గౌడ్, అరికెపూడి గాంధీలు చంద్రబాబుని కలిసి అభినందనలు తెలిపారు. తర్వాత తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలపై చంద్రబాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం గ్రేటర్‌ పరిధిలో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో అత్యధికులు గతంలో చంద్రబాబు నేతృత్వంలో పని చేసిన టీడీపీ నేతలే కావటం గమనార్హం. ఆ కారణంగానే.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సెటిలర్స్ మద్దతుతో వారంతా గెలుపొందారని విశ్లేషకులు అంటుంటారు. అదలా ఉంటే.. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో చాలా మంది పార్టీ మారే యోచనలో ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది. బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతున్న నేపథ్యంలో.. ఇప్పటికే ఏడుగురు గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. మిగిలినవారిలోనూ చాలా మంది అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.

ఇక అటు ఏపీలో టీడీపీ విజయం సాధించటంతో పాటు ఇటు తెలంగాణ సీఎంతో సత్సంబంధాలు పెట్టుకోవటంతో.. తెలంగాణలో మళ్లీ టీడీపీ పుంజుకుంటుందనే ఉత్సాహం తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తోంది. ఈ క్రమంలో.. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్న మాజీ టీడీపీ నేతలు మళ్లీ సొంత గూటికి చేరుకునే అవకాశం కూడా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన హామీల పరిష్కారం కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యేందుకు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఎన్టీఆర్ భవన్‌కు వెళ్లారు. అక్కడ పార్టీ శ్రేణులతో జరిగిన మీటింగ్లో తెలంగాణలో టీడీపీకి పుర్వవైభవం తీసుకొస్తామని ప్రకటించారు.

Also Read : ఇద్దరు సీఎంల భేటీపై మాజీ ఉపరాష్ట్రపతి ట్వీట్ వైరల్‌

తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పిన సాయంత్రానికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ కావటం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అదలా ఉంటే కేసీఆర్ తెలుగుదేశంలో చాలాకాలం కొనసాగారు. 1999లో గెలిచినప్పుడు చంద్రబాబు ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఆఫర్ చేశారు. అయితే మంత్రి పదవి ఆశించిన కేసీఆర్ పార్టీ నుంచి బయటకువచ్చి టీఆర్ఎస్ పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఆయన చంద్రబాబును శత్రువులా చూస్తుంటారన్న ప్రచారం ఉంది. 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ.. చంద్రబాబుని ద్వేషిస్తూనే ఉంటారంటారు.. దానికి తగ్గట్లే 2014 ఎన్నికల్లో పోలింగ్ ముగియగానే చంద్రబాబుపై తన అక్కసు వెళ్ళగక్కారు.

పోలింగ్ ముగిసిందో లేదో మీడియా ముందుకొచ్చిన కేసీఆర్ తెలంగాణలో తాను.. ఏపీలో జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నామని ఘనంగా ప్రకటించారు. ఇటీవల ఎన్నికల్లో కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాంటాయన ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లి చంద్రబాబుని కలవడంతో తీవ్ర అసహనంతో ఉన్నారంట. అరికెపూడి గాంధీ, ప్రకాష్‌గౌడ్ కదలికలపై ఆరా తీస్తున్నారంట. అసలే సగం సచ్చిన పార్టీపై బెంగ పెట్టుకున్న ఆయనకు ఈ ఎపిసోడ్ పుండు మీద కారం రాసినట్లు తయారైందంటున్నారు.

Tags

Related News

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Big Stories

×