Mulugu Rains: ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలు స్థానిక ప్రజల జీవితాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగుల ధాటికి రహదారి వ్యవస్థ ప్రాణాలమీదికి తెచ్చింది. చీకుపల్లి వద్ద జాతీయ రహదారి 163పై ఉన్న తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడంతో.. తెలంగాణ , ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రవాణా పూర్తిగా స్తంభించిపోయింది.
ఇసుకవాగు ఉధృతికి కొట్టుకుపోయిన డైవర్షన్ రోడ్డు
జగన్నాథపురం నుండి టేకులగూడెం వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ పనులను రూ.120 కోట్ల అంచనా వ్యయంతో అధికారులు ఇటీవల ప్రారంభించారు. ఈ పనుల్లో భాగంగా ఇసుకవాగుపై ఉన్న పాత వంతెనను కూల్చివేసి, నూతన వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
అయితే కొత్త వంతెన నిర్మాణం ఆలస్యం కావడంతో, వాహనాల రాకపోకల కోసం పక్కనే ఒక తాత్కాలిక (డైవర్షన్) రోడ్డును ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి నుండి కురిసిన భారీ వర్షాలకు ఇసుకవాగు ఒక్కసారిగా ఉప్పొంగి ప్రవహించడంతో, ఆ ఉధృతికి ఈ తాత్కాలిక రహదారి కాస్తా నీటిలో కొట్టుకుపోయింది.
26 గ్రామాలకు నిలిచిన రాకపోకలు..
26 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు
ఈ రహదారి దెబ్బతినడంతో వాగుకు అవతల వైపు ఉన్న వాజేడు మండలంలోని 26 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 7,000 మంది ఏజెన్సీ గిరిజనులు తమ జిల్లా కేంద్రమైన ములుగుతో పూర్తి సంబంధాలు కోల్పోయి ఐసోలేషన్లో పడిపోయారు.
నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలన్నా, అత్యవసర వైద్య సేవలు పొందాలన్నా స్థానిక ప్రజలు తెలంగాణ వైపు వచ్చే మార్గం లేక, విధిలేని పరిస్థితుల్లో ఛత్తీస్గఢ్ వైపు వెళ్లాల్సి వస్తోంది.
అధికారుల నిర్లక్ష్యమే కారణమా?
వంతెన నిర్మాణ పనుల్లో తీవ్ర విలంబన జరగడం, రాబోయే వర్ష కాలాన్ని దృష్టిలో ఉంచుకుని బలమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభంలోనే రహదారి కొట్టుకుపోవడంతో రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక రహదారిని పునరుద్ధరించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఏజెన్సీ ప్రజలు కోరుతున్నారు.
Also Read: అమెజాన్ బంపరాఫర్.. ‘వన్ప్లస్ 13’పై రూ.12 వేల తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలివే!