CM KCR: సీఎం కేసీఆర్లో చాలా ఛేంజ్ వచ్చింది. ఆయన పాలన తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గడిచిన నాలుగున్నరేళ్లు స్థబ్దుగా ఉండగా.. కొన్ని నెలలుగా నిర్ణయాల్లో వేగం పెరిగింది. పాలనలో దూకుడు కనిపిస్తోంది. ఎన్నికల ముందు.. చాలా డైనమిక్గా పని చేస్తున్నారు. అయితే, అనేక తప్పటడుగులు పడుతున్నా.. విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నా.. కేసీఆర్ మాత్రం చేయాలనుకున్నది చేసుకుపోతున్నారు.
111 జీవో. దశాబ్దాలుగా జంట నగరాలను, జంట జలాశయాలను కాపాడుతున్న జీవో. హైదరాబాద్ను ఆనుకునే ఉండటంతో.. ఆయా గ్రామాల భూములు బంగారు తునకలుగా మారాయి. కానీ, 111 జీవో వల్ల అవి ఇంకా గ్రామాలుగానే మిగిలిపోయాయి. అలాంటిది, ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. హఠాత్తుగా ఆ జీవోను ఎత్తేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది సర్కారు. ఇదేమీ ఆశామాషీ డెసిషన్ కానే కాదు. అందుకే, రేవంత్రెడ్డి పదునైన ఆరోపణలు చేస్తున్నారు. అక్కడి భూములన్నీ కేటీఆర్, బీఆర్ఎస్ వర్గీయులే కొనేశారని.. వారికి లబ్ది చేకూర్చడానికే జీవో 111 ఎత్తేశారని.. దీని వెనుక లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని అంటున్నారు. సూటిగా కొందరి పేర్లు కూడా చెబుతున్నారు. కేటీఆర్, కవిత, సంతోష్ కుమార్, ఎంపీ రంజిత్రెడ్డిలను టార్గెట్ చేశారు. వారికి సహకరించారంటూ సోమేశ్ కుమార్, అర్వింద్ కుమార్లనూ తప్పుబడుతున్నారు.
111 జీవో అనే కాదు. ఇటీవలే ORR లీజు విషయంలోనూ ఇలానే జరిగింది. అనూహ్యంగా బంగారు బాతు లాంటి ఓఆర్ఆర్ను.. అంగట్లో అడ్డగోలు ధరకు అమ్మేసుకుంది సర్కార్. అతితక్కువ ధరకు 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడంపై పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, కేంద్రమంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. ORR లీజు వెనుక వేల కోట్లు చేతులు మారాయని ఆరోపించారు.
అంతకుముందు, హైదరాబాద్ కేబీఆర్ పార్క్లో నిబంధనలకు విరుద్దంగా బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వడం వెనుకా భారీ మొత్తంలో డీల్ జరిగిందని రేవంత్రెడ్డి ఆ ఇష్యూని బయటకు లాగారు.
ఇక, మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ను సలహదారుగా నియమించుకోవడం, మహారాష్ట్రకు చెందిన శరద్ మర్కడ్ను తనకు పర్సనల్ సెక్రటరీగా నియమిస్తూ.. ప్రభుత్వం తరఫున నెలకు లక్షన్నర జీతం ఇస్తూ ఉత్తర్వులు ఇవ్వడమూ కాంట్రవర్సీగా మారింది. అటు, TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై ఎంత రచ్చ అవుతోందో.
మరోవైపు, ఎన్నికలు వస్తున్నాయనగా 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహం.. అట్టహాసంగా కొత్త సచివాలయ ప్రారంభోత్సవం.. జూన్ 2న అమరుల స్మారకం.. ఉద్యోగుల క్రమబద్దీకరణ, పెండింగ్ బిల్లులన్నీ పూర్తిగా చెల్లింపు, అట్టహాసంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ.. ఇలా చేస్తున్నవన్నీ ఎన్నికల స్టంట్సే అంటున్నారు. పోలింగ్ నాటికి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కనిపించేలా కేసీఆర్ పావులు కదుపుతున్నారని అనుమానం.
ఇన్నాళ్లూ లేనిదే ఇప్పుడే 111 జీవో రద్దు, ఓఆర్ఆర్ లీజు, కేబీఆర్ పార్కులో కమర్షియల్ కాంప్లెక్స్.. ఇవన్నీ ఎందుకు? డబ్బుల కోసమేనా? ఎన్నికల ఖర్చు కోసమేనా? అందులోనూ తెలంగాణ ఎన్నికలకా? దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ వ్యాప్తికా? పార్టీ ప్రయోజనాల కోసం ప్రజల ఆస్తులు, ప్రయోజనాలను అమ్మేసుకుంటారా? కొన్ని పనులు కాసుల కోసం.. కొన్ని నిర్ణయాలు ఎన్నికల కోసమా? ఇలా విపక్షాల నుంచి అనేక ప్రశ్నలు, నిలదీతలు వస్తున్నాయి. అయినా.. కేసీఆర్ నోటి నుంచి ఒక్క మాట కూడా రావట్లే. ప్రభుత్వ పెద్దలు ఒక్క కౌంటర్ కూడా వేయట్లే. ఎందుకు?
నేను చేసేది చేస్తా.. మీరు అనేది అనుకోండనే వ్యూహమా? ఓ రెండు రోజులు లొల్లి లొల్లి జరుగుతుంది.. ఆ తర్వాత అంతా కామ్ అవుతుందనే స్ట్రాటజీనా? కేసీఆర్ ఎందుకలా మౌన వ్రతం పాటిస్తున్నారు? జవాబు చెప్పుకోలేకనా? విపక్షాల ప్రశ్నలకు తన దగ్గర సమాధానం లేకనా? కారణం ఏదైనా.. కేసీఆర్ మాత్రం నేనే రాజు, నేనే మంత్రి తరహాలో తనకు నచ్చింది చేసుకుపోతున్నారు. విపక్షాలు ఎంతగా గగ్గోలు పెడుతున్నా.. ఒక ఇష్యూ ముగిసేలోగా మరో ఇష్యూని తెరమీదకు తీసుకొస్తున్నారని అంటున్నారు.