రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. త్వరలోనే ఎంపీటీసీ,జెట్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు జరగుతాయని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు మరోసారి ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల ఫలితాలతో జోరు మీదున్న కాంగ్రెస్.. ఈ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, మండల స్థాయి నేతలకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. బీఆర్ఎస్ సైతం మొన్నటి ఫలితాల కంటే మెరుగైన ఫలితాలు రాబట్టాలని చూస్తున్నది. అందుకోసం యుద్ధప్రతిపాదికన రివ్వ్యూలు, నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నది.
సర్పంచ్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని లీడర్లు ఎంతో ఆశపడ్డారు. నోటిఫికేషన్ వెలువడుతుందని ఎదురుచూశారు.కానీ సీఎం రేవంత్ ఒక్క ప్రకటనతో వారి ఆశలు ఆడియాశలయ్యాయి. సర్పంచ్ ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్లు వర్తింపజేయలేదు. దీంతో బీసీ సంఘాలు చాలా నిరుత్సాహంలో ఉన్నాయి. ప్రస్తుతం రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉన్నది.దీంతో మరోసారి అసెంబ్లీలో రిజర్వేషన్ల అంశంపై ప్రతిపక్షాలతో చర్చించి ఏకాభిప్రాయం వచ్చాకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం అన్నారు. ఈ మేరకు త్వరలోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది.
అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని గత కొంత కాలంలో బీఆర్ఎస్ పెద్దలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆరుగ్యారెంటీలు, బీసీ రిజర్వేషన్లు, పెన్షన్ల పెంపు, మహిళలకు రూ.2500, కృష్ణా గోదావరి జలాలు, ఏపీ జలదోపిడీపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే గత బీఆర్ఎస్ హయాంలో పాలకులు చేసిన తప్పులు, తాము చేస్తున్న పనులను వివరించి బీఆర్ఎస్ను ఎండగట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అసెంబ్లీ నిర్వహణకు సంబంధించి రేపు (సోమవారం) క్లారిటీ రానుంది..
రేపు ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సీఎం సమావేశం కానున్నారు. ఇందులో అసెంబ్లీ సమావేశాలు, పంచాయతీ ఎన్నికల ఫలితాలు, మండల పరిషత్ ఎన్నికలకు బీసీ రిజర్వేషన్ల పెంపు, గ్లోబల్ సమ్మిట్లో జరిగిన ఒప్పందాలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు, కార్పొరేషన్ చైర్మన్ల నియామకం చేపట్టనున్నట్లు సమాచారం. కాగా, ముందుగా అసెంబ్లీని నిర్వహించి పరిషత్ ఎన్నికలపై నోటిఫికేషన్ విడుదల చేయాలని సర్కారు భావిస్తున్నది. ఏపీ జలదోపిడీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మెతక వైఖరి పాటిస్తుందంటూ కేసీఆర్ ఇటీవల విమర్శించారు. కేసీఆర్ ఈ విషయమై లేఖ రాస్తే అసెంబ్లీలో చర్చకు తాము సిద్ధం అంటూ సీఎం రేవంత్ సైతం కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈసారి అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్చ ‘నువ్వా నేనా’ అన్నట్టుగా చర్చ జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు అధికార కాంగ్రెస్ భారీ కసరత్తు మొదలెట్టినట్టు తెలుస్తుంది.అసెంబ్లీ సాక్షిగా గత సర్కారు వైఫల్యాలను, అవినీతిపై నిలదీస్తేనే కాంగ్రెస్కు వచ్చే ఎన్నికల్లో ప్లస్ కానుందని సీఎం రేవంత్, సీనియర్లు ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ సమావేశాలకు అయినా కేసీఆర్ హాజరవుతారా? లేదా ఫాంహౌస్కే పరిమితం అవుతారా? అనేది తెలియాల్సి ఉంది.