El Niño Telangana: ప్రపంచ వ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం కనిపిస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. గతంలో చూడని విధంగా ఈసారి ఎల్ నినో ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు అంటున్నారని తెలిపారు. ఎన్నడూ లేని కరువు ఈసారి వచ్చే ప్రమాదం ఉందని, భూగర్భ జలాలు కూడా తగ్గిపోయి ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని మంత్రి తుమ్మల తెలిపారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కునేందుకు రాష్ట్రంలో చర్యలు చేపట్టాలని ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. రైతులు ఆరు తడి పంటలు వేసేలా ప్రచారం చేయాలని అవగాహన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ప్రతి వారం ఎల్ నినో పై జిల్లా స్థాయిలో సమీక్ష చేస్తామన్నారు. మొదట ప్రాధాన్యత మంచి నీరు, సాగు నీరు పై దృష్టి పెడుతామని, రైతులు కూడా ఈ కరువు కాలంలో పంటల పై జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తుమ్మల అన్నారు.
ఎల్ నినో పై ప్రభుత్వం ఎన్ని నిర్ణయాలు తీసుకుంటున్నా దీనికి ప్రజల సహకారం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రతి పౌరుడు ఈ కరువు సమయంలో సామాజిక బాధ్యతతో సహకరించాలని అన్నారు. రైతులు ఆరుతడి పంటకు వేయాలని కోరుతున్నామని, ప్రస్థుతం అన్ని ప్రాంతాల్లో వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోందని మంత్రి పొన్నం తెలిపారు.
Also read: నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!
ఈ కరువు దృష్ట్యా ప్రతి జిల్లా కేంద్రంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉంటామని మంత్రి తెలిపారు. ఎల్ నినో ఇలానే ఎక్కువ కాలం ఉంటే తాగునీటికి కూడా ఇబ్బందులు తప్పవని అన్నారు. అందుకే సాగు నీటితో పాటుగా తాగు నీరు అంశంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు. కాళేశ్వరం విషయంలో భేషజాలు ఏమీ లేవు. మంచి సలహాలు ప్రతిపక్షాలు ఇచ్చినా తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇప్పుడు మేడిగడ్డ దగ్గర 16 వేల క్యూసెక్లు మాత్రమే ఉందని, మొన్న వరద వచ్చిన సమాచారంతో బీఆర్ఎస్ రాజకీయం చేసిందని తెలిపారు.
Also read: Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!