U19 Asia Cup 2025 Final: 2025 ఆసియా టి-20 కప్ టోర్నమెంట్ లో ఛాంపియన్ గా నిలిచిన టీమ్ ఇండియా ఇప్పటివరకు ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయింది. ఇందుకు గల కారణం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి {PCB} మాత్రమే కాకుండా.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ {ACC} కి కూడా మొహ్సిన్ నఖ్వి అధిపతిగా వ్యవహరిస్తూ ఉండడం. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ – పాకిస్తాన్ తొలిసారిగా ఆసియా కప్ టోర్నీలో తలపడ్డాయి.
Also Read: T20 World Cup 2026 India Squad: గిల్ ను తీసేశారు, కానీ హర్షిత్ రాణాను టచ్ చేస్తే మాడి మసైపోతారు
ఈ క్రమంలో పాకిస్తాన్ దుశ్చర్యలకు నిరసనగా టీమిండియా ఆటగాళ్లు మొదట లీగ్ దశలో పాకిస్తాన్ ప్లేయర్లతో షేక్ హ్యాండ్ కి నిరాకరించారు. దీనిని అవమానంగా భావించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. భారత్ ని నిందలపాలు చేయాలని ప్రయత్నించింది. భారత్ తో మ్యాచ్ కి అంపైర్ గా వ్యవహరించిన వ్యక్తిని తప్పించాలని రచ్చ చేసింది. కానీ ఐసీసీ దిగిరాక పోవడంతో మిన్నకుండిపోయింది.
ఇక ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ తో తలపడిన భారత జట్టు 5 వికెట్ల తేడాతో ట్రోఫీ గెలుచుకుంది. నిబంధనల ప్రకారం తానే టీమ్ ఇండియాకు ట్రోఫీ అందిస్తానంటూ నఖ్వి ముందుకు వచ్చాడు. అయితే అతడు కేవలం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి మాత్రమే కాకుండా ఎసిసి చీఫ్ కూడా. అలాగే పాకిస్తాన్ మంత్రి కూడా కావడంతో భారత జట్టు అతని చేతుల మీదుగా కప్ అందుకునేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో ట్రోఫీతో పాటు మెడల్స్ కూడా తనతో పాటు ఎత్తుకెళ్లాడు నఖ్వి. వాటిని ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు.
అండర్ 19 ఆసియా కప్ 2025 ఫైనల్ లో భాగంగా నేడు దుబాయ్ వేదికగా ఐసీసీ మైదానంలో భారత్ – పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు టీమిండియా ప్రదర్శన అద్భుతంగా కొనసాగింది. ఆడిన ప్రతి మ్యాచ్ లోను ప్రత్యర్థులపై పూర్తిగా ఆధిపత్యం కొనసాగిస్తూ ఘన విజయాలను సాధించింది. ఇక ఫైనల్ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది.
దీంతో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. పాకిస్తాన్ బ్యాటర్ సమీర్ మిన్హస్ {172} భారీ సెంచరీ తో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించాలంటే 348 పరుగులు చేయాలి. అయితే ఈ మ్యాచ్ లో భారత్ గెలుపొందడం పక్కాగా కనిపిస్తోంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ కి నఖ్వి మరికాసేపట్లో హాజరవుతున్నట్లు సమాచారం. మ్యాచ్ విన్నర్లకు ట్రోఫీని ఆయనే అందజేస్తారు. ఒకవేళ ఈ మ్యాచ్ లో భారత్ గెలుపొందితే అతడి నుండి ట్రోఫీని తీసుకునేందుకు టీమిండియా ఆటగాళ్లు నిరాకరించే అవకాశం ఉంది. దీంతో నఖ్వి ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.