Raghunandan Rao: సిద్దిపేట పట్టణంలోని కొండా మల్లయ్య గార్డెన్ వేదికగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులకు బీజేపీ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. గ్రామస్థాయి ప్రజాప్రతినిధులను గౌరవిస్తూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ సభకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరై, గ్రామ రాజకీయాల్లో బీజేపీ ఎదుగుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఎవరూ ఊహించని విధంగా బీజేపీ అద్భుతమైన ఫలితాలు సాధించిందని అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం కార్యకర్తలు, అభ్యర్థులు కష్టపడ్డారని, అందుకే గ్రామ ప్రజలు నమ్మి గెలిపించారని స్పష్టం చేశారు. బీజేపీ పట్టణ పార్టీ మాత్రమే కాదని, గ్రామాల్లో కూడా గెలవగలదని ఈ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలో బీజేపీ బలం క్రమంగా పెరుగుతోందని, రానున్న రోజుల్లో జిల్లా పరిషత్, మున్సిపాలిటీలపై కూడా బీజేపీ జెండా ఎగురవేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు.
త్వరలోనే బీజేపీకి నితిన్ నబిన్ జాతీయ అధ్యక్షుడిగా.. బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని తెలిపారు. బీజేపీ దేశంలో నిజమైన మార్పును కోరుకుంటుందని, ఆ మార్పుకు యువతే ప్రధాన శక్తి అని అన్నారు. భవిష్యత్ ఎన్నికల్లో బీజేపీ మాత్రమే ప్రజలకు దిక్సూచి అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి అనేది గెలుపుకు మొదటి మెట్టని, విశ్వసనీయతను నిరూపించుకుంటే విజయం తప్పక మనదేనని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన రఘునందన్ రావు, ఎమ్మెల్యేలకు రావాల్సిన రూ.5 కోట్ల అభివృద్ధి నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కూడా ప్రావిడెంట్ ఫండ్స్ ఇవ్వకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.
మహాత్మా గాంధీ పేరు ప్రస్తావిస్తూ, కాంగ్రెస్కు గాంధీపై నిజమైన ప్రేమ లేదని విమర్శించారు. గాంధీ కళలను, గాంధీ ఆలోచనలను కాంగ్రెస్ పట్టించుకోలేదని, వాటిని అమలు చేయడంలో బీజేపీ ముందుంటుందని అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిధులను నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేస్తోందని, ఇది గ్రామాల అభివృద్ధికి బలమైన ఆధారమని చెప్పారు.
బీజేపీలో గెలిచిన కొంతమంది ఇతర పార్టీల్లోకి వెళ్లడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సిద్ధాంతం కోసం నిలబడే నాయకులు పార్టీని బలపరచాలని, అవకాశవాద రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. బీజేపీ తర్వాత కమ్యూనిస్టు పార్టీలకే కొంత చిత్తశుద్ధి ఉందని వ్యాఖ్యానిస్తూ, కాంగ్రెస్పై పరోక్ష విమర్శలు చేశారు.
Also Read: వరుసగా కూలుతున్న చెక్ డ్యామ్లు.. వైఫల్యాలకు కారణాలేంటి..?
గ్రామస్థాయి పాలనపై దృష్టి పెట్టాలని నూతన ప్రజాప్రతినిధులకు సూచించిన రఘునందన్ రావు, ప్రతి వారం స్వచ్ఛ గ్రామం కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. అవినీతి లేకుండా పాలన సాగించాలని, నీతి నిజాయితీగా పని చేసి ప్రజల్లో గౌరవం సంపాదించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేయనుందని తెలిపారు.