Big Stories

KTR : మునుగోడులో చేపట్టే పనులు ఇవే..హామీలన్నీ నెరవేరుస్తాం : కేటీఆర్‌

KTR : మునుగోడు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ తో కలిసి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -

మునుగోడులో త్వరలోనే 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని ప్రకటించారు. చండూరు మున్సిపాలిటికీ రూ. 50 కోట్లు, చౌటుప్పల్‌ మున్సిపాలిటీకి రూ. 30 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు. చండూరును రెవెన్యూ డివిజన్‌గా మారుస్తామన్నారు. మునుగోడు నియోజకవర్గంలో కొత్తగా 5 సబ్‌ స్టేషన్లు నిర్మిస్తామని తెలిపారు. నారాయణపురంలో గిరిజన గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.

- Advertisement -

నల్గొండ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల ముందు చెప్పిన విధంగానే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు. ఏ ఎన్నికలైనా సరే నల్గొండ జిల్లా ప్రజలు టీఆర్ఎస్ కు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. అందుకే జిల్లాలోని 12 నియోజకవర్గాలు టీఆర్ఎస్ కే దక్కాయన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పెండింగ్‌ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని కేటీఆర్ చెప్పారు. 2014కు ముందు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క వైద్య కళాశాల లేని విషయాన్ని గుర్తు చేశారు. నల్గొండ జిల్లాలో వచ్చే 6 నెలల్లో రూ.1,544 కోట్లు ఖర్చు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News