Harishrao : తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ సారి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మంత్రి హరీష్ రావు మధ్య వార్ నడుస్తోంది. కేంద్ర ఇస్తున్న నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమని కిషన్ రెడ్డికి హరీష్ రావు సవాల్ చేయడం పొలిటికల్ హీట్ ను పెంచింది.
తాజాగా జగిత్యాల జిల్లా పర్యటనలో హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 7న సీఎం కేసీఆర్ జగిత్యాలలో కొత్త కలెక్టరేట్, మెడికల్ కాలేజీ భవనాలను, పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను హరీష్ రావు పరిశీలించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ గోబెల్స్ ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. నిధులు ఇవ్వకుండా రాష్ట్రాలను కేంద్రం ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ కోసం దొడ్డిదారిన సెస్ల రూపంలో వేల కోట్లు వసూలు చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో 20 శాతం ఆదాయం సెస్ల రూపంలోనే వస్తోందని హరీష్ రావు తెలిపారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. రాష్ట్రాలకు 42 శాతం నిధులు ఇస్తున్నామని అంటున్నారని కానీ 29.6 శాతం నిధులే కేంద్రం ఇస్తోందని హరీష్ రావు స్పష్టంచేశారు. ఆ వివరాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. ఈ అంశంపై చర్చకు కిషన్రెడ్డి సిద్దమా అని హరీష్ రావు సవాల్ విసిరారు. 42 శాతం నిధుల పేరుతో కేంద్రం.. రాష్ట్రాల్లోని అనేక పథకాలను రద్దు చేసిందన్నారు. దీని వల్ల తెలంగాణ వేల కోట్లు నష్ట పోయిందని తెలిపారు. ఈ 8 ఏళ్లలో కేంద్రం చాలా అప్పులు అప్పులు చేసిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి, నిరుద్యోగులను మోసం చేస్తోందని మండిపడ్డారు. కాంట్రాక్ట్ పద్దతిలో కొందరికి దోచిపెడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు.