Hyderabad: తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వ్యవహారాల ఇన్చార్జ్ మారే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ప్లేస్లోకి కొత్త వ్యక్తి వస్తారని అంటున్నారు. తాజాగా గాంధీభవన్లో జరిగిన వినాయక చవితి పూజలో మాజీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే కనిపించడంతో నేతలు షాకయ్యారు. అసలు ఏం జరిగింది?
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఉన్నత చదువుల కోసం రేపో మాపో విదేశాలకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కొత్త ఇన్చార్జిని నియమించే దిశగా కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు మొదలు పెట్టింది. రేపో మాపో ప్రకటన రావచ్చని ప్రచారం ఉంది. రాజకీయ పరిణామాల దృష్ట్యా పూర్తి స్థాయిలో సీనియర్ నేతకు ఈ బాధ్యతలు అప్పగించాలని ఆలోచన చేస్తున్నట్లు ఢిల్లీ వర్గాల మాట.
ఇదిలావుండగా సోమవారం వినాయక చవితి సందర్భంగా గాంధీభవన్లో పూజ చేశారు. ఆ సమయంలో తెలంగాణ మాజీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ప్రత్యక్షమయ్యారు. దీంతో ఆయన్ని కొత్త ఇన్ఛార్జ్గా నియమించారనే ప్రచారం జోరందుకుంది. ఉన్నట్లుండి ఆయన హైదరాబాద్ రావడం వెనుక ఏం జరిగింది? గతంలో ఆయన ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. అప్పటి పరిణామాల దృష్ట్యా ఆ తర్వాత దీపా దాస్మున్షీ, చివరకు మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఏనాడు మాణిక్రావు ఠాక్రే గాంధీభవన్లో ప్రత్యక్షమైన సందర్భం లేదని అక్కడి వచ్చిన కొందరు నేతలు అంటున్నారు.
ALSO READ: దళితుల ఓట్ల కోసమే BRS వాడకం.. శ్వేతపత్రం విడుదల చేయాల్సిందే: పీసీసీ చీఫ్
మరోవైపు నామినేటెడ్ పదవులకు ఎంపిక, మంత్రివర్గ విస్తరణ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను ఇప్పటికే మీనాక్షి నటరాజన్ పార్టీ హైకమాండ్కు సమర్పించినట్టు తెలుస్తోంది. మీనాక్షి స్థానంలో కొత్త ఇన్చార్జి కోసం సీనియర్ నేతల పేర్లను పరిశీలిస్తోంది ఏఐసీసీ. అందులో గతంలో తెలంగాణకు ఇన్ఛార్జ్గా పని చేసిన మాణిక్రావు ఠాక్రే పేరు బలంగా వినిపిస్తోంది. ఆ తర్వాత ముకుల్ వాస్నిక్, శక్తిసిన్హ్ గోహిల్ పేర్లు ఉన్నాయి. చివరలో దిగ్విజయ్ సింగ్, అశోక్ గెహ్లాట్ పేర్లు లేకపోలేదు. మరి మాణిక్రావు ఠాక్రే గాంధీభవన్కు రావడం వెనుక అసలు మేటరేంటో?