Mahesh Kumar Goud: గాంధీ భవన్ వేదికగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ సభాపతిని కులం పేరుతో దూషించడం కేవలం ఒక వ్యక్తి వ్యాఖ్య మాత్రమే కాదని, దళితుల పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఉన్న అసలైన వైఖరిని స్పష్టం చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో దళితుడిని సీఎం చేస్తామని మాట తప్పడమే కాకుండా, 2003లో ఇచ్చి నెరవేర్చని హామీలపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దళితులు నిరసన తెలిపిన నేలను శుద్ధి చేయడమనేది ఘోరమైన చర్య అని, కాలం మారినా బీఆర్ఎస్ నేతల్లో దొరతనం తగ్గలేదని విమర్శించారు.
భయంతోనే కేసీఆర్ అసెంబ్లీకి రావడంలేదు
గత పదేళ్ల పాలనలో దళితులు, బీసీలపై దాడులు కోకొల్లలుగా జరిగాయని, కేవలం ఓట్ల కోసమే దళితబంధు తెచ్చి వివక్ష చూపారని తీవ్రంగా మండిపడ్డారు. దళిత స్పీకర్ కు గౌరవం ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే కేసీఆర్ అసెంబ్లీకి రావడంలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ దళితులకు ఏఐసీసీ అధ్యక్ష పదవితో పాటు కేంద్ర మంత్రులుగా, రాష్ట్రపతులుగా ఉన్నత స్థానాలు కల్పించిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ కు నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా నియమించాలని సవాల్ విసిరారు.
బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్..
మరోవైపు భూముల సమస్యలపై స్పందిస్తూ 22/A సెక్షన్ వల్ల సామాన్య ప్రజలకు నష్టం జరగకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అవసరమైతే ఈ చట్టాన్ని సవరించి బాధితులకు న్యాయం చేయాలని, ధరణి పోర్టల్ పేరుతో వేల ఎకరాల ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయని ఆరోపించారు. ఈ లోపాలపై హరీష్ రావు, కేటీఆర్ స్పందించి ప్రజలకు నిజాలు చెప్పాలని డిమాండ్ చేయడంతో పాటు, పార్టీ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఉన్నత విద్య కోసం దరఖాస్తు చేసుకున్నారని, దానిపై అధిష్టానం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.
Also Read: బోరిస్ జాన్సన్ ప్రయాణిస్తున్న రైలుపై రష్యా డ్రోన్ దాడి.. త్రుటిలో తప్పిన ప్రాణపాయం!