Medchal: మేడ్చల్ జిల్లా జోడిమెట్ల వద్ద వినాయక విగ్రహం కొనుగోలు విషయంలో చెలరేగిన వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. విగ్రహం విషయంలో మొదలైన స్వల్ప ఘర్షణ కాస్త పెద్దదై, రెండు వర్గాలు దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. ఈ దాడిలో చౌదరిగూడకు చెందిన ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. పండగ వాతావరణంలో జరగాల్సిన చోట ఇలాంటి దారుణం చోటుచేసుకోవడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
జాతీయ రహదారిపై బంధువుల ధర్నా
వ్యక్తి మృతి చెందిన విషయం తెలియడంతో ఆగ్రహించిన మృతుడి బంధువులు, స్నేహితులు వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి తీవ్ర నిరసన తెలిపారు. ఈ ఘటనలో దాడికి పాల్పడిన ఐదుగురు నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులకు సర్దిచెప్పి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఈ ఘర్షణపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తును వేగవంతం చేశారు.
Also Read: 8వ ఆసియా కప్ విజేత భారత్.. మహిళల టీమ్పై అమిత్ షా ప్రశంసల వర్షం!