Telangana Private Schools: చదువు భావితరాలకు మనం ఇచ్చే తరగని ఆస్తి. అలాంటి చదువుపేరు చెప్పి కోట్లు దండుకుంటూ, ఫీజులు ఎంతైనా పర్వాలేదు మంచి విద్య అందించాలన్న తల్లిదండ్రుల ఆశలను పెట్టుబడిగా చేసుకుని కొందరు కేటుగాళ్లు దగా చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండానే, నిబంధనలు పాటించకుండా కొందరు సంస్థలు మసిపూసి మాయ చేస్తున్నట్లు సమాచారం.
భారీ భవనాలు, డిజిటల్ ప్రదర్శనలు, గణాంకాలు చూపిస్తూ మేమే ఉత్తమం ఇదే తక్కువ ఖర్చుతో కార్పొరేట్ పాఠశాల అంటూ అమాయక ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల నిర్వహణ సంఘం (టీఆర్ఎస్ఎమ్ఏ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. సంబంధిత విద్యా అధికారుల అనుమతి, గుర్తింపు, చట్టపరమైన ఆమోదాలు లేకుండానే కొన్ని పాఠశాలలు పనిచేస్తున్నాయని, ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని టీఆర్ఎస్ఎమ్ఏ ఆరోపించింది.
Also Read: Minister Ponguleti: కాంగ్రెస్ పార్టీలో చేరిన ఐదుగురు స్వతంత్ర కార్పొరేటర్లు.. ఎక్కడంటే..?
ప్రత్యేకంగా హైదరాబాద్లో రెజోనెన్స్ పేరుతో నడుస్తున్న కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో అక్రమాలు జరుగుతున్నాయని సంఘం పేర్కొంది. ఇలాంటి అనుమతి లేని ప్రైవేటు పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. టీఆర్ఎస్ఎమ్ఏ ఆధ్వర్యంలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. రెజోనెన్స్, అలెన్, ఫిజిక్స్ వాలా తదితర సంస్థలు శిక్షణ కేంద్రాల పేరుతో పాఠశాలలుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన జి.ఓ. ఎం.ఎస్. నెం. ఇతర నియమావళి ప్రకారం అవసరమైన అనుమతులు పొందకుండానే విద్యా కార్యక్రమాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తగిన మౌలిక వసతులు, భద్రతా ప్రమాణాలు, అర్హత కలిగిన బోధక సిబ్బంది లేకుండానే సంస్థలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. అడ్మిషన్ల విషయంలో తప్పుడు ఫలితాలు చూపించడం, ప్రత్యేక సదుపాయాలు, ఫీజు రాయితీల పేరుతో తప్పుడు హామీలు ఇవ్వడం జరుగుతోందని ఆరోపించారు. సరైన పత్రాలు లేకుండా విద్యార్థులను చేర్చుకోవడం, బదిలీ ధ్రువపత్రాలు, రికార్డులు ఇవ్వకపోవడం, అధికారిక ఫీజు రసీదులు జారీ చేయకపోవడం వంటి లోపాలు ఉన్నాయని తెలిపారు.
శిక్షణ కేంద్రాల పేరుతో నడుస్తున్న ఈ సంస్థల్లో పారదర్శకత లేదని టీఆర్ఎస్ఎమ్ఏ పేర్కొంది. మధ్యవర్తులు, పరిచయాలు, అనధికార సిఫార్సుల ద్వారా అడ్మిషన్లు కల్పించడం జరుగుతోందని ఆరోపించింది. కొందరు తల్లిదండ్రులకు ప్రత్యేక రాయితీలు, సదుపాయాలు ఇవ్వడం వల్ల సమానత్వానికి భంగం కలుగుతోందని తెలిపింది. ఇలాంటి చర్యలు విద్యా నాణ్యతను దెబ్బతీస్తాయని, తల్లిదండ్రుల మధ్య అసమానత పెంచుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. భద్రతా ప్రమాణాలు పాటించని పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
తమకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని తల్లిదండ్రులకు, ప్రభుత్వానికి చెప్పి అధికారులను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెజోనెన్స్లో జరుగుతున్న అడ్మిషన్ విధానాలపై సమగ్ర విచారణ జరపాలని సంఘం కోరింది.
ప్రైవేటు పాఠశాలలో ఒక విద్యార్థిని చేర్చుకోవాలంటే పారదర్శకమైన, నైతిక అడ్మిషన్ విధానం ఉండాలని టీఆర్ఎస్ఎమ్ఏ సూచించింది. గోప్య ఫిర్యాదు వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరింది. తల్లిదండ్రులకు చట్టబద్ధ అడ్మిషన్ నిబంధనలపై అవగాహన కల్పించాలని పేర్కొంది. ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా, తల్లిదండ్రులను మోసం చేస్తూ విద్య పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న ఇలాంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ఎమ్ఏ డిమాండ్ చేసింది.
తాము సమర్పించిన ఫిర్యాదుకు జత చేసిన ఆధారాల ఆధారంగా సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరింది. అనుమతి లేకుండా నడుస్తున్న పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, నిబంధనలు పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. ప్రైవేటు పాఠశాలల పేరుతో రెజోనెన్స్, అలెన్, ఫిజిక్స్ వాలా తదితర సంస్థలు చేస్తున్న అనైతిక ప్రచారాన్ని అడ్డుకోవాలని టీఆర్ఎస్ఎమ్ఏ నాయకులు కోరారు. విద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగి, ప్రజలు మోసపోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల ప్రయోజనాల రక్షణ, విద్యా ప్రమాణాల పరిరక్షణ కోసం ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని సంఘం స్పష్టం చేసింది.