Bhogapuram Airport: ఏపీలోని విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ఆగస్టు 1న ప్రారంభ కాబోతోంది. సుమారు రూ.4,727 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ స్వయంగా లాంచ్ చేయనున్నారు. కాగా ఈ సువిశాలమైన ఎయిర్ పోర్ట్ ను రికార్డు స్థాయిలో 31 నెలల వ్యవధిలోనే పూర్తి చేశారు. టార్గెట్ సమయం కంటే 5 నెలల ముందే నిర్మాణాన్ని ఫినిష్ చేయడం విశేషం. ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రత్యేకతలు, దానికి సంబంధించిన విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
దేశంలో అత్యంత వేగంగా పూర్తైన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాలలో భోగాపురం ఒకటిగా నిలిచింది. ఈ విమానాశ్రయాన్ని జీఎంఆర్ గ్రూప్ అనుబంధ సంస్థ ‘జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్’.. పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) పద్ధతిలో నిర్మించింది. ఇప్పటికే ఈ విమానాశ్రయం డీజీసీఏ (DGCA) ఏరోడ్రోమ్ లైసెన్స్తో పాటు భద్రత, ఫైర్, పర్యావరణ అనుమతులన్నింటినీ సాధించింది. మొదటి దశ కింద ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించేలా ఈ ఎయిర్ పోర్ట్ ను రూపొందించారు. భవిష్యత్తులో దీనిని 4 కోట్ల మంది ప్యాసింజర్ల సామర్థ్యానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ భోగాపురం ఎయిర్ పోర్టు ప్రాజెక్టు.. దాదాపు 2,703 ఎకరాల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఎయిర్పోర్ట్ కోసం 2,203.32 ఎకరాలు, ఏవియేషన్ హబ్ కోసం 500 ఎకరాలు, ఏవియేషన్ యూనివర్సిటీ కోసం 136.63 ఎకరాలను కేటాయించారు. ఇక్కడ నిర్మించిన 3,800 మీటర్ల విశాలమైన ‘కోడ్-ఈ’ రన్వే ఈ ఎయిర్పోర్ట్కే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీనిపై బోయింగ్ 777, బోయింగ్ 787 డ్రీమ్లైనర్, ఎయిర్బస్ A330, A340 వంటి భారీ విమానాలు సైతం ఇక్కడ సులభంగా ల్యాండ్ కాగలవు. రాత్రివేళల్లో విమానాల రాకపోకలకు వీలుగా అత్యాధునిక ఎయిర్ఫీల్డ్ లైటింగ్, నేవిగేషన్ సిస్టమ్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
ప్రయాణికుల సౌకర్యార్థం ఎయిర్ పోర్ట్ టెర్మినల్ లో అత్యాధునిక సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఒకసారి లోపలికి ఎంటర్ అయిన ప్రయాణికుడు ఫ్లైట్ ఎక్కేవరకు.. ల్యాండ్ అయిన వారు ఎగ్జిట్ అయ్యేంత వరకు జరిగే ప్రక్రియను అధునాతన సాంకేతికతను ఉపయోగించే చాలా ఫాస్ట్ గా మార్చబోతున్నారు. ఇందుకోసం కాంటాక్ట్ బోర్డింగ్ బ్రిడ్జిలు, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్, కామన్ యూజ్ ప్యాసింజర్ ప్రొసెసింగ్ సిస్టమ్ (CUPPS), స్మార్ట్ సర్వైలెన్స్, సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ వంటి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగంగా విమానాశ్రయ ప్రక్రియలను పూర్తి చేసుకోవచ్చు.
ఉత్తరాంధ్ర ఎగుమతి రంగాన్ని బలోపేతం చేసేందుకు ఏటా 25,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల కార్గో టెర్మినల్ను ఎయిర్ పోర్టులో సిద్ధం చేశారు. అందులో ఫార్మా, సముద్ర ఉత్పత్తులు, త్వరగా పాడైపోయే వస్తువుల కోసం కోల్డ్ చైన్ సదుపాయాలు ఉన్నాయి. విశాఖపట్నం పోర్టు, ప్రధాన పారిశ్రామిక కారిడార్లతో అనుసంధానించడం ద్వారా భోగాపురం విమానాశ్రయం.. తూర్పు తీరంలోనే అతిపెద్ద లాజిస్టిక్స్ హబ్గా మారనుంది.
పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ లీడ్ ప్లాటినం (LEED Platinum) ప్రమాణాలతో ఎయిర్ పోర్ట్ ను అభివృద్ధి చేశారు. 5 మెగావాట్ల సోలార్ ప్లాంట్, వర్షపు నీటి నిల్వ, నీటి పునర్వినియోగ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్ట్ నీటి అవసరాల్లో దాదాపు 30 శాతాన్ని రీసైకిల్ చేసిన నీటి ద్వారానే భర్తీ చేయనున్నారు. ఇక ఆర్కిటెక్చర్ విషయానికొస్తే.. విశాఖ సముద్ర తీర ప్రాశస్త్యాన్ని, ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలా ‘ఎగిరే చేప’ ఆకారంలో టెర్మినల్ డిజైన్ కావడం విశేషం.
Also Read: సామాన్యులకు అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్.. ఇవన్నీ మారిపోతున్నాయి!
ప్రధానీ మోదీ పర్యటన, విమానాశ్రయ ప్రారంబోత్సవం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఉత్తరాంధ్ర సంస్కృతి, పర్యాటకం, అభివృద్ధి ఆకాంక్షలను చాటిచెప్పేలా పండుగ వాతావరణంలో ఈ ప్రారంభోత్సవం జరగాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ప్రధానికి గిరిజన సాంప్రదాయ థింసా నృత్యాలు, కూచిపూడి ప్రదర్శనలతో ఘన స్వాగతం పలకబోతున్నారు. ముఖ్యంగా గిన్నిస్ వరల్డ్ రికార్డే లక్ష్యంగా రికార్డు స్థాయి కళాకారులతో భారీ థింసా నృత్య ప్రదర్శనను నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
Also Read: బైక్పై వెళ్తూ పాటలు వింటున్నారా? అయితే మీ డ్రైవింగ్ లైసెన్స్ గోవిందా!