Namo Bharat Solar Project: దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలు సర్వీసుల్లో నమో భారత్ ఒకటి. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ రైళ్లు ఢిల్లీ-మీరట్ మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించాయి. 2023లో ప్రారంభమైన ఈ సర్వీసు ఇప్పుడు మరో ప్రత్యేకతను సొంతం చేసుకోబోతోంది. నమో భారత్ కారిడార్ విద్యుత్ అవసరాల్లో పెద్ద మొత్తాన్ని సౌర విద్యుత్తో తీర్చేందుకు భారీ ప్రాజెక్ట్ ను చేపడుతున్నారు.
ఢిల్లీ-మీరట్ RRTS కారిడార్ కోసం 110 మెగావాట్ల క్యాప్టివ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.450 కోట్ల పెట్టుబడి అవసరమవుతుందని అంచనా. ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే కారిడార్కు అవసరమైన విద్యుత్లో దాదాపు 60 శాతం సౌర విద్యుత్ నుంచే లభించే అవకాశం ఉంది. దీంతో విద్యుత్ ఖర్చు కూడా భారీగా తగ్గనుంది.
నమో భారత్ కారిడార్ నిర్వహణ ఖర్చుల్లో విద్యుత్ వాటా సుమారు 30 నుంచి 35 శాతం వరకు ఉంటుంది. అందుకే విద్యుత్ ఖర్చును తగ్గించడంపై అధికారులు దృష్టి పెట్టారు. సౌర విద్యుత్ ప్రాజెక్టు పూర్తయితే వార్షిక విద్యుత్ వ్యయంలో దాదాపు 25 శాతం వరకు తగ్గింపు రావచ్చని అంచనా వేస్తున్నారు. 25 ఏళ్ల పాటు స్థిరమైన టారిఫ్కు విద్యుత్ కొనుగోలు చేసేలా ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. దీని వల్ల భవిష్యత్తులో విద్యుత్ ధరల మార్పుల ప్రభావం కొంత తగ్గే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్టు వల్ల ఆర్థిక ప్రయోజనాలతో పాటు పర్యావరణానికి కూడా మేలు కలగనుంది. సాంప్రదాయ విద్యుత్ స్థానంలో సౌర విద్యుత్ను వినియోగించడం ద్వారా ఏటా సుమారు 1.8 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాల ఉద్గారాలు కూడా తగ్గే అవకాశం ఉంది. దీంతో పట్టణ రవాణాను మరింత పర్యావరణహితంగా మార్చేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది.
NCRTC ఇప్పటికే ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ RRTS కారిడార్లోని స్టేషన్లు, డిపోలు, ఇతర భవనాలపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ప్రస్తుతం 11 మెగావాట్లకు పైగా సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇప్పుడు 110 మెగావాట్ల క్యాప్టివ్ ప్లాంట్తో ఈ సామర్థ్యం మరింత పెరగనుంది. రాబోయే 24 నెలల్లో ప్లాంట్ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
దేశంలో ప్రాంతీయ రవాణాను వేగవంతం చేయడానికి మరిన్ని నమో భారత్ కారిడార్లను కూడా ప్రతిపాదిస్తున్నారు. ఢిల్లీ-పానిపట్-కర్నాల్, ఢిల్లీ-గుర్గావ్-బవాల్, ఘజియాబాద్-జేవార్ వంటి మార్గాలు ఇందులో ఉన్నాయి. వేగవంతమైన రైలు సేవలతో పాటు రీ జెనరేటివ్ విద్యుత్ను కూడా కలిపి భారత పట్టణ రవాణాలో కొత్త నమూనాను తీసుకురావాలనే దిశగా నమో భారత్ ముందుకు సాగుతోంది.
Read Also: రాత్రి 9 తర్వాత నో ఎంట్రీకి చెక్.. శ్రీశైలానికి 24/7 రూట్ క్లియర్!