Delhi-Patna Bullet Train: దేశంలో హైస్పీడ్ రైళ్లకు ప్రాధాన్యం పెరుగుతున్న వేళ మరో కీలక ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ మీదుగా బీహార్ లోని పాట్నా వరకు బుల్లెట్ రైలు కారిడార్ను ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం గంటల తరబడి పట్టే ప్రయాణ సమయం భారీగా తగ్గే అవకాశం ఉంది. ఢిల్లీ నుంచి పాట్నాకు కేవలం 4.5 గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంటుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ప్రతిపాదిత బుల్లెట్ రైలు కారిడార్ ఢిల్లీని ఆగ్రా, కాన్పూర్, లక్నో, ప్రయాగ్రాజ్, వారణాసి, పాట్నా లాంటి ప్రధాన నగరాలతో అనుసంధానించనుంది. దీంతో ఢిల్లీ-యూపీ-బీహార్ మధ్య ప్రయాణం మరింత వేగంగా మారనుంది. ఈ ప్రాజెక్ట్ లో ఢిల్లీ నుంచి ఆగ్రా వరకు ఉన్న 200 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 58 నిమిషాల్లో చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. ఢిల్లీ నుంచి కాన్పూర్కు 455 కిలోమీటర్ల దూరాన్ని 1 గంట 50 నిమిషాల్లో పూర్తి చేయవచ్చని అంచనా.
ఢిల్లీ-లక్నో మధ్య దాదాపు 495 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణానికి చాలా సమయం పడుతుంది. అయితే బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే కేవలం 2 గంటల 12 నిమిషాల్లో లక్నో చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే ఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్కు 750 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 3 గంటల్లో, వారణాసికి 945 కిలోమీటర్ల ప్రయాణాన్ని 3 గంటల 33 నిమిషాల్లో పూర్తి చేయవచ్చని రైల్వే శాఖ చెబుతోంది.
ఈ కారిడార్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది ఢిల్లీ-పాట్నా ప్రయాణం. రెండు నగరాల మధ్య దాదాపు 1,170 కిలోమీటర్ల దూరం ఉంది. బుల్లెట్ రైలు సేవలు ప్రారంభమైతే ఈ దూరాన్ని సుమారు 4.5 గంటల్లో చేరుకోవచ్చని అంచనా. ఈ ప్రాజెక్ట్ అమల్లోకి వస్తే ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ తర్వాత దేశంలో మరో కీలక బుల్లెట్ రైలు మార్గంగా నిలిచే అవకాశం ఉంది.
ప్రస్తుతం భారతీయ రైల్వేలో వందే భారత్ వంటి సెమీ-హైస్పీడ్ రైళ్లు గరిష్ఠంగా గంటకు 180 కిలోమీటర్ల డిజైన్ వేగాన్ని కలిగి ఉన్నాయి. మరోవైపు ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్లో డిజైన్ వేగం గంటకు 350 కిలోమీటర్లు కాగా, నిర్వహణ వేగం 320 కిలోమీటర్లుగా ఉంది. దేశంలో తొలి హైస్పీడ్ రైలు సేవలు 2027 ఆగస్టులో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొదట సూరత్-వాపి మధ్య ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Read Also: నమో భారత్కు ఇక సూర్యుడి పవర్.. ఇండియన్ రైల్వే ప్లాన్ అదిరింది భయ్యా!