Istanbul: బస్సులు, రైళ్లు, విమానాలు మాత్రమే కాదు.. చివరకు ఓడలు కూడా ఢీ కొన్న ఘటనలు జరగుతున్నాయి. తాజాగా ఇస్తాంబుల్ సమీపంలోని మర్మారా సముద్రంలో రెండు వాణిజ్య నౌకలు ఢీ కొన్నాయి, ఈ ఘటనలో ఓ నౌక మునిగి పోయింది. అందులోని 10 మంది సిబ్బంది గల్లంతయ్యారని ఆ దేశ తీరప్రాంత అధికారులు తెలిపారు.
టర్కీ స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇస్తాంబుల్లోని సిలివ్రి జిల్లా సమీపంలో సుమారు 3 వేల టన్నుల ఇంజన్ ఆయిల్ను తీసుకువెళ్తున్న అల్సు అనే ట్యాంకర్.. దాదాపు 4200 టన్నుల కాయిల్డ్ స్టీల్ను తీసుకువెళ్తున్న తుగ్బెర్క్ ఇమామోగ్లు అనే బల్క్ క్యారియర్ను బలంగా ఢీ కొట్టింది. తుగ్బెర్క్ ఇమామోగ్లు ఓడ నల్ల సముద్రంలోని కరాడెనిజెరెగ్లి ఓడరేవుకు వెళ్తుండగా, తుగ్బెర్క్ షిప్ సముద్రంలోని అలియాగా ఓడ రేవు వైపు ప్రయాణం చేస్తోంది.
టర్కీ సముద్ర వ్యవహారాల అథారిటీ వివరాల ప్రకారం.. జరిగిన ఘటన గురించి రెస్క్యూ సెంటర్కు తెల్లవారుజామున 3. 26 గంటలకు తుగ్బెర్క్ ఇమామోగ్లు నౌక నుండి అత్యవసరంగా సంకేతాలు వచ్చాయి. సుమారు 15 నిమిషాల తర్వాత నౌకలు ఢీ కొన్న విషయాన్ని వెల్లడించారు. సిలివ్రి తీరానికి 18 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన గురించి తెలియగానే అధికారులు టుగ్బెర్క్ ఇమామోగ్లు నౌకలోని సిబ్బందికి పదే పదే కాల్స్ చేశారు. కానీ ఆ నౌక ఎలాంటి స్పందన రాలేదు. సిబ్బంది మొబైల్ ఫోన్లలో అందుబాటులో లేకపోవడంతో ఆ నౌక మునిగిపోయిందని అధికారులు నిర్ధారించారు.
ALSO READ: ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్ను వాడిన భర్త, చివరికి జైల్లో
గాలింపు, సహాయక చర్యల కోసం ఒక హెలికాప్టర్, 14 కోస్ట్గార్డ్ నౌకలను రంగంలోకి దిగాయి. ఈ ఘటనలో అల్సు నౌకకు ఎలాంటి నష్టం జరగలేదని ఇస్తాంబుల్ గవర్నర్ కార్యాలయం వెల్లడించింది. మునిగిపోయిన నౌక కోసం గాలింపు తీవ్రతరం చేశారు. ఇస్తాంబుల్ ఛాంబర్ ఆఫ్ మారిటైమ్ కామర్స్ నుండి అందిన సమాచారం ఆధారంగా తుగ్బెర్క్ ఇమామోగ్లు జేబే డెనిజ్సిలిక్ యాజమాన్యం నిర్వహిస్తోంది. అల్సు నౌక బాధ్యతను ఓజ్పులాతానే డెనిజ్ తసిమాసిలిగి నిర్వహిస్తోంది.