IRCTC Ticket Booking System: ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై వేగంగా, సులభంగా రైలు టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. దాదాపు 40 ఏళ్లుగా ఉపయోగిస్తున్న పాత ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) స్థానంలో కొత్త క్లౌడ్ ఆధారిత టిక్కెట్ బుకింగ్ వ్యవస్థను తీసుకురాబోతోంది. ఆగస్టు 2026 నుంచి ఈ కొత్త సిస్టమ్ ను అమల్లోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఈ వ్యవస్థతో టిక్కెట్ బుకింగ్ లో ఎదురవుతున్న సమస్యలు చాలా వరకు తగ్గనున్నాయి.
ప్రస్తుతం ఉపయోగిస్తున్న PRS వ్యవస్థను 1986లో ప్రారంభించారు. అప్పట్లో ఇది పెద్ద సాంకేతిక మార్పుగా భావించినా, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఆ వ్యవస్థ పాతబడిపోయింది. ఈ పాత సిస్టమ్ ఇటానియం సర్వర్లు, ఓపెన్విఎంఎస్ టెక్నాలజీపై ఆధారపడి పని చేస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రైల్వే కౌంటర్లు, ఐఆర్సీటీసీ వెబ్ సైట్, మొబైల్ యాప్ ఇదే వ్యవస్థతో లింకై ఉన్నాయి.
దేశంలో దాదాపు 88 శాతం రైలు టిక్కెట్లు ఆన్లైన్ ద్వారానే బుక్ అవుతున్నాయి. ముఖ్యంగా పండుగలు, వేసవి సెలవులు, ప్రత్యేక సందర్భాల్లో టిక్కెట్ల కోసం భారీగా డిమాండ్ ఉంటుంది. అలాంటి సమయంలో సర్వర్లు స్లో అవడం, పేమెంట్ ఫెయిల్ అవడం, టిక్కెట్ కన్ఫర్మ్ కాకపోవడం లాంటి సమస్యలు తరచూ ఎదురవుతుంటాయి. కొత్త వ్యవస్థతో ఈ ఇబ్బందులు చాలా వరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
పాత వ్యవస్థ నిమిషానికి సుమారు 32 వేల టిక్కెట్లను మాత్రమే బుక్ చేయగలిగేది. కానీ, కొత్త క్లౌడ్ ఆధారిత సిస్టమ్ నిమిషానికి 1.5 లక్షల టిక్కెట్ల వరకు ప్రాసెస్ చేస్తుంది. అంటే, టిక్కెట్ బుకింగ్ వేగం దాదాపు ఐదు రెట్లు పెరగనుంది. అలాగే రైళ్లలో సీట్ల లభ్యతను తనిఖీ చేసే సామర్థ్యం కూడా భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం నిమిషానికి 4 లక్షల సెర్చ్ లు మాత్రమే నిర్వహించగలిగితే, కొత్త వ్యవస్థలో అది 40 లక్షల వరకు పెరుగుతుంది.
కొత్త సిస్టమ్లో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. విమాన టిక్కెట్ల మాదిరిగా రైలులో కూడా తమకు నచ్చిన సీట్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ కలిసి ప్రయాణించాలనుకుంటే పక్కపక్కనే సీట్లు బుక్ చేసుకోవచ్చు. అదే విధంగా ఛార్జీల క్యాలెండర్ కూడా కనిపించేలా ఏర్పాటు చేయనున్నారు. దివ్యాంగులు, వృద్ధులు, రోగుల కోసం ప్రత్యేక ఫీచర్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఇక భాషా పరంగా కూడా ప్రయాణికులకు సౌలభ్యం కల్పించనున్నారు. హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో టిక్కెట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో స్థానిక భాషల్లోనే టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
అంతేకాదు, ఈ కొత్త వ్యవస్థ వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలను ముందుగానే అంచనా వేసి ప్రయాణికులకు సమాచారం ఇస్తుంది. ప్రస్తుతం ఈ అంచనాల కచ్చితత్వం 53 శాతం నుంచి 94 శాతానికి పెరిగిందని అధికారులు చెబుతున్నారు. కొత్త PRS వ్యవస్థ అమల్లోకి వస్తే టిక్కెట్ బుకింగ్ మరింత వేగంగా, సులభంగా మారనుంది.
Read Also: ట్రైన్ లో కూలరేసుకుని దర్జాగా పడుకున్న ప్రయాణికుడు.. నెట్టింట వీడియో వైరల్!