India’s First EV Reva Turns 25: ప్రస్తుతం ఇండియన్ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ కార్ల హవా పెరిగింది. టాటా, మహీంద్రా, ఎంజీ, హ్యుందాయ్ లాంటి సంస్థలు సరికొత్త ఈవీలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అయితే, భారత్ లో ఈవీ ప్రయాణానికి పునాది 25 ఏళ్ల క్రితమే పడిందని చాలా మందికి తెలియదు. ఇండియాలో తొలి ఎలక్ట్రిక్ కారుగా గుర్తింపు పొందిన రేవా 2001లోనే వినియోగదారుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆ కారుకు 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దాని ప్రయాణం మరోసారి ఆటో ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది.
రేవా వ్యవస్థాపకుడు చేతన్ మైని అప్పట్లోనే భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలదేనని నమ్మారు. నగరాల్లో తక్కువ ఖర్చుతో, పర్యావరణానికి మేలు చేసే వాహనం అవసరమనే ఆలోచనతో ఆయన రేవాను రూపొందించారు. ఆ రోజుల్లో ఛార్జింగ్ స్టేషన్లు లేవు. ఈవీ టెక్నాలజీకి అవసరమైన సరఫరా వ్యవస్థ కూడా లేదు. అయినప్పటికీ అన్ని సవాళ్లను ఎదుర్కొంటూ ఈ కారును అభివృద్ధి చేశారు.
రేవా పూర్తిగా నగర ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉండేది. గరిష్ట వేగం గంటకు 65 కిలోమీటర్లు మాత్రమే అయినప్పటికీ, రోజువారీ ప్రయాణాలకు అది సరిపోతుందని అప్పట్లో భావించారు. ఇంట్లోనే ఛార్జ్ చేసుకునే సౌకర్యం, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, చిన్న పరిమాణంతో ఆకట్టుకునేది.
ఆ కాలంలో మార్కెట్ ఈవీలను తీసుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ కూడా చివరి నిమిషంలో ఉపసంహరించుకోవడంతో రేవా ధర పెరిగింది. దీంతో ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగలేదు. అయినప్పటికీ, రేవా సాంకేతికంగా భారత ఆటోమొబైల్ రంగానికి కొత్త దిశను చూపింది. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, ఛార్జర్లు, ఇతర కీలక భాగాలను దేశీయంగానే అభివృద్ధి చేయడం ఆ సంస్థ సాధించిన గొప్ప విజయంగా నిలిచింది.
రేవా కేవలం భారత్ కే పరిమితం కాలేదు. యూకే, నార్వేతో పాటు మొత్తం 24 దేశాలకు ఎగుమతి అయింది. విదేశాల్లో మంచి ఆదరణ కూడా పొందింది. తర్వాత మహీంద్రా సంస్థ రేవాను కొనుగోలు చేసి, ఆ టెక్నాలజీ ఆధారంగా తన ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి చేయడం ప్రారంభించింది. ఇప్పటికీ రేవాను ఉపయోగిస్తున్న కొందరు యజమానులు దాని సింపుల్ డిజైన్, తక్కువ ఖర్చు, ఈజీ పార్క్ సౌకర్యం ఉండటం పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటి ఈవీలతో పోలిస్తే సామర్థ్యం తక్కువైనా, భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్లిన మొదటి కారుగా రేవా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే, రేవాను మళ్లీ తీసుకొచ్చే ఆలోచనలు లేవని చేతన్ మైని చెప్పుకొచ్చారు. అయితే, భవిష్యత్తులో అవకాశం వస్తే ఎప్పుడూ కాదనబోనని చెప్పారు. దీంతో రేవా పేరు మరోసారి భారత ఈవీ రంగంలో వినిపించే అవకాశం ఉందనే చర్చ మొదలయ్యింది.
Read Also: ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!