దుబాయ్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక నగరాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు అక్కడికి వెళ్తుంటారు. వ్యాపారం, షాపింగ్, కుటుంబ సభ్యులను కలవడం వంటి కారణాలతో కూడా అనేక మంది దుబాయ్ను సందర్శిస్తారు.
ఇటీవల ఇరాన్, అమెరికా యుద్ధం కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (దుబాయ్ సహా 7 రాష్ట్రాల దేశం) పర్యాటక రంగానికి తీవ్ర నష్టం కలిగింది. అయితే పర్యాటకులను మళ్లీ ఆకర్షించేందుకు యుఎఇ ప్రభుత్వం కొత్త వీసా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తోంది.
అలాంటి కొత్త అవకాశాల్లో ఒకటి 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా. ఈ వీసాతో భారతీయులు స్పాన్సర్ లేదా హోస్ట్ అవసరం లేకుండా ఐదేళ్ల పాటు ఎన్నిసార్లైనా యూఏఈలోకి ప్రవేశించే అవకాశం పొందవచ్చు. అయితే ఇందుకు కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.
దుబాయ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) ఈ దీర్ఘకాలిక టూరిస్ట్ వీసా అందిస్తోంది. ఈ వీసా పొందిన వారు ఐదేళ్ల కాలంలో అనేకసార్లు యూఏఈకి వెళ్లే అవకాశం పొందుతారు.
ఈ వీసా కోసం స్థానిక స్పాన్సర్ లేదా హోస్ట్ అవసరం ఉండదు. తరచుగా దుబాయ్ వెళ్లే వారికి ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యులను కలవడం, బిబినెస్ మీటింగ్స్ హాజరుకావడం లేదా టూర్ వెళ్లడం మరింత సులభమవుతుంది.
దరఖాస్తుదారుల వద్ద కనీసం 6 నెలల వాలిడిటీ (గడువు) ఉన్న పాస్పోర్ట్ ఉండాలి. ఇటీవల తీసిన పాస్పోర్ట్ సైజు ఫోటోను సమర్పించాలి. అలాగే వాలిడ్ ఆరోగ్య బీమా పత్రం, రౌండ్ ట్రిప్ విమాన టికెట్ తప్పనిసరిగా ఉండాలి. గత ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్ను కూడా సమర్పించాలి.
దరఖాస్తు చేసుకునే ముందు ఆరు నెలల కాలంలో కనీసం 4,000 అమెరికన్ డాలర్లు లేదా సుమారు రూ.3.82 లక్షలు బ్యాంక్ ఖాతాలో ఉండాలి. ఇతర కరెన్సీలలో సమాన మొత్తాన్ని కూడా అంగీకరిస్తారు.
దరఖాస్తుదారులు యూఏఈ అధికారిక డిజిటల్ ప్లాట్ఫామ్లు లేదా మొబైల్ యాప్ల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్లైన్ సౌకర్యం ఉపయోగించలేని వారు కస్టమర్ హ్యాపినెస్ సెంటర్లు లేదా అమెరికన్ సర్వీస్ సెంటర్లలో కూడా దరఖాస్తు పూర్తి చేయవచ్చు.
ముందుగా అవసరమైన వీసా సేవను ఎంపిక చేసి దరఖాస్తు ఫారం నింపాలి. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసిన తర్వాత ఫీజు చెల్లించి దరఖాస్తును సమర్పించాలి. సరైన వివరాలు ఇవ్వడం వల్ల ఆలస్యం లేకుండా ప్రక్రియ పూర్తవుతుంది.
ఈ వీసా కోసం మొత్తం దరఖాస్తు ఫీజు సుమారు 3,713 దిర్హమ్ (దుబాయ్ కరెన్సీ) అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1 లక్ష ఉంటుంది. ఇందులో వీసా ఫీజు, సర్వీస్ ఛార్జీలు మరియు తిరిగి చెల్లించే సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఉంటాయి.
అయితే వ్యక్తిగత పరిస్థితుల ఆధారంగా ఈ ఫీజు మొత్తం మారవచ్చు. అదనపు పత్రాలు అవసరమైతే ఖర్చు కూడా పెరగవచ్చు.
వీసా పొందిన వారు అనుమతించిన గడువుకంటే ఎక్కువ రోజులు ఉండకూడదు. ఓవర్స్టే చేస్తే జరిమానాలు విధించే అవకాశం ఉంది. అందుకే తమ ఎంట్రీ, ఎగ్జిట్ వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించడం మంచిది.
Also Read: వింత గ్రామం.. ఏదీ తాకకూడదు, గుడిలో ప్రవేశం నిషేధం, రాత్రి బసచేయకూడదు
తరచూ దుబాయ్ వెళ్లేవారికి ఈ వీసా ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి ప్రయాణానికి కొత్త వీసా కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉండదు.
బిజినెస్ టూర్స్ మరింత సులభమవుతాయి. కుటుంబ సభ్యులను తరచుగా కలిసే అవకాశం ఉంటుంది. పర్యాటకులు కూడా తమ ప్రయాణాలను మరింత సౌకర్యంగా ప్లాన్ చేసుకోవచ్చు.