Pan Am Flight 914 Mystery: పాన్ అమెరికన్ వరల్డ్ ఎయిర వేస్. ఈ సంస్థ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. 1927లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతర్జాతీయ విమాన ప్రయాణాన్ని సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించింది. ఒకానొక సమయంలో అమెరికాలోనే అతిపెద్ద అంతర్జాతీయ ఎయిర్ లైన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ, ఈ సంస్థకు సంబంధించిన ఓ వింత కథ ఇప్పటికీ చాలామందిని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. అదే ‘పాన్ ఆమ్ ఫ్లైట్ 914’ మిస్టరీ.
1955 జూలై 2న ఈ సంస్థకు చెందిన పాన్ ఆమ్ 914 ఫ్లైట్ న్యూయార్క్ నుంచి మయామికి బయల్దేరింది. విమానంలో నలుగురు సిబ్బందితో పాటు 57 మంది ప్రయాణికులు ఉన్నారు. వాతావరణం కూడా బాగానే ఉండటంతో ప్రయాణం సజావుగా సాగుతుందని అందరూ భావించారు. కానీ, విమానం బయల్దేరిన కొద్ది సేపటికే ఆ విమానం రాడార్ నుంచి మాయమైపోయింది. అధికారులు ఎంత వెతికినా జాడ దొరకలేదు. చివరికి అది సముద్రంలో కూలిపోయిందని భావించి కేసును క్లోజ్ చేశారు.
కానీ, కథ అక్కడితో ముగియలేదు. ఈ ఘటన జరిగిన సుమారు 37 సంవత్సరాల తర్వాత, అంటే 1992లో, వెనిజులాలోని కారకాస్ విమానాశ్రయంలో ఓ అద్భుతం జరిగింది. అకస్మాత్తుగా రాడార్ పై ఒక పాత మోడల్ DC-4 విమానం కనిపించింది. అంతేకాదు, ఆ విమానం అక్కడ ల్యాండ్ అయిన తర్వాత, పైలట్ ట్రాఫిక్ కంట్రోల్ ను మనం ఎక్కడ ఉన్నామని అడిగాడట. ఇది విన్న అధికారులు ఆశ్చర్యపోయారు. ఆ పైలెట్ తనను పాన్ ఆమ్ 914 పైలట్ గా పరిచయం చేసుకున్నారట. కానీ, అధికారులు అతడికి ఇది 1992 సంవత్సరం అని చెప్పగానే, పైలట్ ఒక్కసారిగా భయపడి, వెంటనే విమానాన్ని మళ్లీ టేకాప్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడని అంటారు.
ఈ ఘటనలో మరో షాకింగ్ విషయం ఏంటంటే? ఆ విమానంలోని ప్రయాణికులు ఎవరూ వృద్ధులుగా కనిపించలేదట. అంటే 1955లో ఎలా ఉన్నారో అచ్చం అలాగే ఉన్నారని ఆ ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. అయితే, వారి కుటుంబ సభ్యులు మాత్రం సంవత్సరాల తర్వాత పెద్దవారయ్యారు. ఈ విషయం విన్న చాలా మంది టైమ్ ట్రావెల్ నిజమా? అని ఆనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, ఈ కథకు సంబంధించి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. విమానయాన చరిత్రలో కూడా పాన్ ఆమ్ 914 ఫ్లైట్ నిజంగా ఉన్నట్టు రికార్డులు కూడా లేవు. ప్రజల్లో ప్రచారం పొందిన ఒక కల్పిత కథగానే చాలా మంది భావిస్తున్నారు. పాన్ ఆమ్ ఫ్లైట్ 914 కథ నిజమా? కాదా? అన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. కానీ, విమానయాన రంగంలో వినిపించే అత్యంత వింత కథలలో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయింది.
Read Also: జమ్మూ నుంచి శ్రీనగర్ కు డైరెక్ట్ ట్రైన్.. దశాబ్దాల కల సాకారం!