రెండున్నరేండ్ల పాలనలో రైతులకేమి చేశామో జనానికి వివరించే క్రమంలో సర్కార్ సక్సెసయ్యింది. వరుసగా ముగ్గురు.. ఒక్కొక్కరు ఒక్కో విధానం, వివరణ. ఎవరికి వారే లోతైన సమాచారం… ప్రచారాలను తిప్పికొట్టే విధంగా ఖుల్లం ఖుల్లా వివరాలు..!
వరుసబెట్టి చెప్పిన విధానంతో చాలా మందిలో నెలకొని ఉన్న అనుమానాలు నివృత్తి అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించింది. మొదట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆ తరువాత వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తీన్మార్లో చివరగా సీఎం రేవంత్రెడ్డి.. వరుసబెట్టి వివరించిన వైనం… గణాంకాలతో తెలంగాణ సమాజం ముందు ఉంచిన తీరు.. బాగా కనెక్టయ్యింది.
అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా రైతుల కోసం పదేళ్ల పాలనలో ఏం చేశారు? ఈ రెండున్నరేండ్లలో కాంగ్రెస్ సర్కార్ ఏం చేసింది? అనే విషయాలపై చాలా స్పష్టత వచ్చింది ఈ మీటింగు ద్వారా. రైతు బీమా ప్రీమియం చెల్లించలేదని గగ్గోలు పెట్టారు. కానీ ఆ ప్రీమియం మొత్తంఎంత చెల్లించారో లెక్కలతో సహా వివరించారు తుమ్మల.
రైతుల కోసం మొత్తం పదేళల్లో కేసీఆర్ చేసిన ఖర్చెంత..? అది నెలకు ఎంత..? ఏడాదికి ఎంత..? అని విపులంగా లెక్కలు తీశాడు భట్టి.. అప్పుడు పెట్టిన ఖర్చుకు.. దాదాపుగా రెట్టింపు ఖర్చు కాంగ్రెస్ సర్కార్ చేసిందని గణాంకాలతో వివరించడం బాగుంది. ఇది ఒక చర్చకు చాన్స్ ఇచ్చింది. రేపు బీఆరెస్ ఈ లెక్కలనై వాదనలు చేసినా.. చర్చ అర్థవంతగా సాగుతుంది.
జనాలకు కూడా కరెక్టుగా ఎవరేమి చేశారో అర్థమవుతుంది. అంతేకాదు.. బీఆరెస్ కన్నా డబుల్ ఖర్చు పెడుతున్నది వివరిస్తూనే.. అదీ కేసీఆర్ చేసిన అప్పులు, మిత్తీల కింద.. ఏడాదికి రెండు లక్షల కోట్ల పై చిలుకు మొత్తం చెల్లిస్తూ.. అని వివరించడం రైతులకు బాగా కనెక్టయ్యింది. దీంతో పాటు.. వాళ్లు పెట్టిన ఖర్చు పదేళ్లకు. ఇప్పుడు సర్కార్ చేసిన ఖర్చు లెక్కలు రెండున్నరేండ్లవి. అంటే సగం టర్మ్లోనే డబుల్ ఖర్చు చేశామని కళ్లకు కట్టినట్టు.. అందరికీ అర్థమయ్యేటట్టు వివరించారు భట్టి.
ఇక తుమ్మల కూడా వాస్తవాలను కళ్లకు కట్టారు. ఓ సీజన్ రైతు భరోసా వేయలేకపోయామని రైతులకు పరిస్థితి వివరించి చెప్పే ప్రయత్నం చేశారు. సబ్జెక్టు పరంగా తుమ్మల, భట్టి గణాంకాలతో.. ఎలాంటి చర్చకైనా సిద్దమేనన్నట్టుగా, బీఆరెస్కు సవాల్ విసురుతున్నట్టుగా మాట్లాడారు. ఇది ఒక రకంగా తమ వంతు చర్చ ఇదని.. ఇక మీరు రండి మీ లెక్కలతో చూసుకుందాం..!అన్నట్టుగానే సాగింది.
ఇక దీనికి ముగింపుగా తీన్మార్ దరువు వేశారు సీఎం రేవంత్. మొత్తానికి ఈ ముగ్గురు సందర్బోచితంగా, సబ్జెక్టుతో కొట్టిన దెబ్బకు బీఆరెస్కు దిమ్మదిరిగిందనే చెప్పాలి. ఈ తీన్మార్ వ్యూహం ఫలించింది. రైతుల వద్ద మంచి మార్కులు పడ్డాయి. ప్రతిపక్షాలకు కళ్లు బైర్లు కమ్మాయి.