కైలాస్ మానసరోవర్ యాత్ర అనేది అనేక మతాల ప్రజలు అత్యంత పవిత్రంగా భావించే ఆధ్యాత్మిక యాత్ర. కైలాస్ పర్వతం, మానసరోవర్ సరస్సు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. చాలా మతాలకు చెందిన వారు ఈ పవిత్ర ప్రాంతంలో తమ దైవం లేదా ఆధ్యాత్మిక గురువు కొలువుదీరినట్లుగా నమ్ముతారు.
హిందూ మతం: కైలాస్ పర్వతాన్ని పరమశివుడు, పార్వతీదేవి శాశ్వత నివాసంగా భక్తులు విశ్వసిస్తారు. పరమశివుడు అక్కడ నిత్య ధ్యానంలో ఉంటారని నమ్మకం. అలాగే మానసరోవర్ సరస్సును సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే స్వయంగా సృష్టించాడని విశ్వసిస్తారు.
బౌద్ధ మతం: బౌద్ధులు కైలాస్ పర్వతాన్ని చక్రసంవర (డెమ్చోక్) అనే దైవం నివాసంగా భావిస్తారు. ఈ దైవం పరమానందం, జ్ఞానోదయానికి ప్రతీకగా పూజించబడుతుంది.
జైన మతం: జైనుల తొలి తీర్థంకరుడు రిషభదేవుడు.. కైలాస్ పర్వత సమీపంలో నిర్వాణం పొందినట్లు వారి నమ్మకం. అందువల్ల ఈ ప్రాంతాన్ని జైనులు అత్యంత పవిత్ర క్షేత్రంగా భావిస్తారు.
బోన్ మతం: టిబెట్కు చెందిన ప్రాచీన బోన్ మతం అనుచరులు కైలాస్ పర్వతాన్ని తమ మతానికి ఆధ్యాత్మిక కేంద్రంగా, అలాగే తమ మత స్థాపకుడి పవిత్ర స్థానంగా భావిస్తారు.
జీవితంలో ఒక్కసారైనా ఈ యాత్ర చేయాలని చాలా మంది హిందూ భక్తులు కోరుకుంటారు. అయితే ఈ యాత్రకు భక్తి మాత్రమే సరిపోదు. అవసరమైన అన్ని అధికారిక పత్రాలను కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి. కైలాస్ పర్వతం, మానసరోవర్ సరస్సు టిబెట్ ప్రాంతంలో ఉన్నాయి. అందువల్ల అంతర్జాతీయ ప్రయాణానికి సంబంధించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.
కైలాస్ మానసరోవర్ యాత్రకు వెళ్లే ప్రతి భారతీయుడి వద్ద చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ ఉండాలి. ఇది విదేశీ ప్రయాణం కావడంతో పాస్పోర్ట్ లేకుండా యాత్ర సాధ్యం కాదు. అధికారిక మార్గంలో దరఖాస్తు చేసుకునే వారు పాస్పోర్ట్ గడువు సరైన కాలం వరకు ఉండేలా చూసుకోవాలి. గడువు ముగియడానికి దగ్గరగా ఉంటే ముందుగానే పునరుద్ధరించుకోవడం మంచిది.
ఈ యాత్రకు సాధారణ చైనా వీసా సరిపోదు. ప్రత్యేకంగా చైనా గ్రూప్ ట్రావెల్ వీసా అవసరం ఉంటుంది. ఈ వీసాను అధికారికంగా గుర్తింపు పొందిన టూర్ ఆపరేటర్ల ద్వారా మాత్రమే పొందవచ్చు. వ్యక్తిగతంగా దీనికి దరఖాస్తు చేసే అవకాశం ఉండదు. అందువల్ల ప్రయాణానికి ముందే వీసా ప్రక్రియను పూర్తి చేయాలి.
టిబెట్ భూభాగంలో ప్రవేశించడానికి ప్రత్యేక ట్రావెల్ పర్మిట్ తప్పనిసరి. ఈ పర్మిట్ను టిబెట్ అధికారులు ఆమోదించిన ట్రావెల్ ఏజెన్సీల ద్వారా మాత్రమే జారీ చేస్తారు. వ్యక్తిగతంగా దీన్ని పొందలేరు. వీసా ఉన్నా కూడా ఈ పర్మిట్ లేకుండా టిబెట్లోకి ప్రవేశించేందుకు అనుమతి ఉండదు.
చాలా మంది యాత్రికులు నేపాల్ నుంచి తమ యాత్రను ప్రారంభిస్తారు. భారతీయులు నేపాల్కు వెళ్లేందుకు చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ లేదా భారత ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డును ఉపయోగించవచ్చు. కాఠ్మాండూ నుంచి మరో దేశానికి విమానంలో వెళ్లే ప్రయాణికులకు కొన్ని సందర్భాల్లో భారత రాయబార కార్యాలయం నుంచి ‘నో అబ్జెక్షన్’ సర్టిఫికేట్ అవసరం కావచ్చు. కాబట్టి ప్రయాణ వివరాలను ముందుగానే పరిశీలించడం మంచిది.
యాత్ర కోసం నమోదు చేసుకునే ముందు టూర్ ఆపరేటర్కు ప్రభుత్వ అనుమతి ఉందో లేదో తప్పకుండా నిర్ధారించుకోవాలి. గుర్తింపు పొందిన సంస్థలే చైనా వీసా, టిబెట్ పర్మిట్ వంటి పత్రాలను పొందే ప్రక్రియను నిర్వహిస్తాయి. దీంతో మోసాలకు గురయ్యే అవకాశాలు తగ్గుతాయి.
Also Read: ఏడాదిలో కేవలం 2 నెలలు మాత్రమే కనిపించే అందమైన నగరం.. పర్యాటకుల ఫేవరెట్ స్పాట్
యాత్రకు అధికారికంగా దరఖాస్తు చేసుకునే వారు కొన్ని ముఖ్యమైన పత్రాలను సిద్ధంగా ఉంచాలి. చెల్లుబాటు అయ్యే సాధారణ భారతీయ పాస్పోర్ట్, తాజా పాస్పోర్ట్ సైజు ఫోటో, పాస్పోర్ట్ మొదటి పేజీ, చివరి పేజీ స్కాన్ కాపీలు అవసరం అవుతాయి. దరఖాస్తులో నమోదు చేసే వ్యక్తిగత వివరాలు పాస్పోర్ట్లో ఉన్న వివరాలతో పూర్తిగా సరిపోవాలి. అలాగే మీరు కోరుకున్న యాత్ర మార్గాన్ని కూడా ఎంపిక చేయాలి.
కైలాస్ మానసరోవర్ యాత్ర కోసం చాలా మంది నెలల తరబడి శారీరకంగా, మానసికంగా సిద్ధమవుతారు. అదే విధంగా పత్రాల సిద్ధతపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఒక చిన్న పత్రం లేకపోయినా మొత్తం యాత్రకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల అన్ని పత్రాలను ముందుగానే సిద్ధం చేసి, వాటి ఫిజికల్, డిజిటల్ కాపీలను భద్రంగా ఉంచుకోవడం ఉత్తమం. సరైన ప్రణాళికతో యాత్రను ప్రశాంతంగా, సురక్షితంగా పూర్తి చేయండి.