Daisugi Technique: సాధారణంగా ఇల్లు కట్టుకోవాలన్నా, ఫర్నిచర్ తయారు చేయాలన్నా చెట్లను నరికేస్తుంటాం. కానీ జపాన్లో మాత్రం ఒక్క చెట్టును కూడా నరకకుండా, శతాబ్దాల తరబడి నాణ్యమైన కలపను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ అద్భుతమైన సాంకేతికత పేరే ‘దైసుగి’ (Daisugi). ప్రస్తుతం పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్న తరుణంలో ఈ ప్రాచీన పద్ధతి ప్రపంచవ్యాప్తంగా మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
జపాన్లోని క్యోటో నగరంలో 14వ శతాబ్దంలో (దాదాపు 600 ఏళ్ల క్రితం) ఈ ‘దైసుగి’ పద్ధతి పుట్టుకొచ్చింది. ఆ కాలంలో జపాన్లో సాంప్రదాయ శైలి ఇళ్ల నిర్మాణానికి ముఖ్యంగా ‘సుకియా-జుకురి’ అనే వాస్తు శైలి ఇళ్లకు బలమైన కలప అయ్యేది. నిటారుగా, ఎటువంటి వంపులు లేని బొంగులను ఇంటి నిర్మాణం కోసం వినియోగించేవారు. అయితే క్యోటో ప్రాంతంలో భూమి కొరత, కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో చెట్లను పెంచడానికి తగినంత స్థలం ఉండేది కాదు. ఈ సమస్యకు పరిష్కారంగానే అక్కడి అటవీ నిపుణులు ‘దైసుగి’ అనే వినూత్న పద్ధతిని కనిపెట్టారు.
‘దైసుగి’ పద్ధతి కోసం ‘కిటాయామా సిడార్’ (Kitayama Cedar) అనే ప్రత్యేకమైన జాతికి చెందిన దేవదారు చెట్లను ఉపయోగిస్తారు. ఇందులో ప్రధానమైన చెట్టును భూమిలోనే అలాగే ఉంచుతారు. ఆ చెట్టు భూమికి దగ్గరగా ఉన్నప్పుడు దాని పైభాగంలోని కొమ్మలను ప్రత్యేకమైన పద్ధతిలో కత్తిరిస్తారు. దీనివల్ల ఆ చెట్టు పైభాగం నుండి కొత్త కొమ్మలు నిటారుగా, ఆకాశం వైపు దూసుకుపోతూ పెరుగుతాయి. చూడటానికి ఇది అచ్చం.. ఒక పెద్ద చెట్టుపై మరెన్నో చిన్న చెట్లు నిలువుగా మొలిచినట్లు కనిపిస్తుంది. ఈ నిలువు కొమ్మలు పక్కలకు వంగకుండా కేవలం పైకే పెరుగుతాయి. ఇవి పూర్తిగా పెరిగిన తర్వాత చెట్టు మెుదలు నరకకుండా.. కేవలం పైకి పెరిగిన ఆ నిటారు కొమ్మలను మాత్రమే నరికి కలపగా వాడుకుంటారు.
సాధారణ పద్ధతిలో పెరిగే చెట్ల కలప కంటే ‘దైసుగి’ పద్ధతిలో లభించే కలపకు డిమాండ్ చాలా ఎక్కువ. ఈ కలప సాధారణ కలప కంటే 200% ఎక్కువ బలంగా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే సహజసిద్ధమైన ఫ్లిక్సిబిలిటీ వల్ల భూకంపాలు ఎక్కువగా వచ్చే జపాన్ లాంటి దేశాల్లో ఇళ్ల నిర్మాణానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పైగా ఈ కొమ్మలు ఎక్కడా వంపులు లేకుండా వంద శాతం నిటారుగా ఎదుగుతాయి. ఈ కలపలో ఉండే సహజ నూనెల వల్ల వీటికి చెదలు పట్టవని జపనీయులు చెబుతున్నారు. వాతావరణ మార్పులను తట్టుకుని వందల ఏళ్లపాటు మన్నికగా ఉంటాయని పేర్కొంటున్నారు.
దైసుగి పద్ధతిని ఉపయోగించి.. ఒకే ఒక్క చెట్టు నుండి దాదాపు 200 నుండి 300 ఏళ్ల పాటు నిరంతరాయంగా కలపను సేకరించవచ్చు. దీనివల్ల అడవులను నరకాల్సిన అవసరం అస్సలు రాదు. కాబట్టి పచ్చదనం ఏళ్ల తరబడి అలాగే కొనసాగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ చెట్లు గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహించి.. స్వచ్ఛమైన ఆక్సిజన్ ను మనుషులు అందిస్తుంటాయి. భూమి కొరత ఉన్న నగరాలు, తక్కువ స్థలంలో ఎక్కువ కలపను ఉత్పత్తి చేయడానికి ఇదొక అద్భుతమైన మార్గంగా నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read: మార్కెట్ను షేక్ ఆడిస్తున్న ‘RGB’ టీవీలు.. ఇంట్లోనే IMAX రేంజ్ విజువల్స్.. కళ్లు చెదిరే క్లారిటీ!
ప్రస్తుతం జపాన్లో ఆధునిక నిర్మాణ పద్ధతులు రావడంతో ఈ ‘దైసుగి’ పద్ధతి వాడకం కొంతవరకు తగ్గింది. అయినప్పటికీ అక్కడ ఇప్పటికీ కొన్ని అడవుల్లో, సాంప్రదాయ తోటల్లో ఈ పద్ధతిని ప్రజలు కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అడవులు అంతరించిపోతున్న నేపథ్యంలో.. ప్రకృతితో కలిసి జీవిస్తూనే మన అవసరాలను ఎలా తీర్చుకోవచ్చో చెప్పడానికి జపాన్ వారి 600 ఏళ్ల నాటి ఈ ‘దైసుగి’ సాంకేతికత ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది.
Also Read: సామాన్యుల స్పెషల్.. రూ.200లోపు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. 2GB డేటా, ఫ్రీ కాల్స్, ఫన్ కంటెంట్!