కాక్రోచులు ఎంతగా ఫేమస్ అయ్యాయో.. ధర్మేంద్ర ప్రధాన్ కూడా అంతగా ఫేమస్ అయ్యాడు. కాక్రోచ్.. లేదా బొద్దింకలు.. ఇప్పుడు ఈ పేర్లు వింటే నిజమైన బొద్దింకలు గుర్తు రావడం లేదు. కాక్రోచ్ జనతా పార్టీ గుర్తొస్తుంది. కాక్రోచులు అనగానే జెన్-జీ యువత గుర్తొస్తున్నారు.
ఇక ఈ కాక్రోచ్ పార్టీ మొదటి నుంచి టార్గెట్ చేస్తూ వస్తున్నది.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను. నీట్(NEET) పేపర్ లీకుకు కారకుడిగా, బాధ్యుడిగా, లక్షలాది మంది విద్యార్ధుల జీవితాలతో ఆడుకున్న రాజకీయ నేతగా ఇతన్ని దేశానికి కాదు.. ప్రపంచానికే పరిచయం చేశారు జెన్-జీ కుర్రాళ్లు. దాదాదాపుగా నెల రోజులుగా వీరు ఈ విషయంలో ఆందోళన బాట పట్టారు.
ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేసేదాకా వదలడం లేదు. కేంద్ర కేబినెట్ నుంచి తొలగించేదాకా ప్రధానినీ వదలడం లేదు. దీంతో ఇది నేరుగా పీఎంతో పట్టువిడవకుండా కొట్లాడుతున్న పార్టీగా అందరి నోళ్లలో నానుతున్నది ప్రస్తుతానికి.
కాంగ్రెస్ కూడా ఈ కాక్రోచ్ల ఉద్యమానికి సపోర్టు చేస్తున్నది. ఇక ఇది బీజేపీకి బద్ద వ్యతిరేకి అని ముద్ర వేసేసిన కాషాయ ప్రేమికులు.. వీరిని ఉగ్రవాదులంటూ కించపరిచే పనిని చేసి అది మరింతగా ఆ పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టేలా చేసుకున్నది. దీన్ని ముందే గ్రహించిన ఆర్.ఎస్.ఎస్… తాము కూడా కాక్రోచ్ పార్టీకి మద్దతు అంటూ ప్రకటించి ఓ వ్యూహాన్ని అమలు చేయాలని చూసింది.
కానీ కేంద్రంలోని పెద్దలు దీన్ని ఓ బొద్దికంగానే, చాలా ఈజీగా తీసిపారేశారు. పలుచన చేసేలా ప్రవర్తించారు. పట్టింపు లేనట్టుగా వ్యవహరించారు. కానీ ఈ బొద్దింకలు మాత్రం ఉడుంపట్టు వీడటం లేదు. దాదాపు 12 రోజులుగా ఢిల్లీ జంతర్మంతర్ వద్ద ఇదే డిమాండ్తో ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. వీరి ఆందోళనకు ప్రజాసంఘాలు, స్వచ్చంధ సంస్థలు, పర్యావరణ వేత్త సోనం వాంగ్చుక్ సహా వేలాది మంది విద్యార్థులు, యువత ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు.
హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద కూడా ఈ పార్టీ నిరసనలు చేపట్టింది. జూన్ మొదటి వారంలో మొదలైన ఈ ఆందోళనలు దాదాపు నెల రోజుల పాటు వివిధ రూపాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరీక్ష లీకేజీ విషయాన్ని ప్రపంచం మరిచిపోయినా.. ఈ కాక్రోచ్ పార్టీ మాత్రం మరిచేలా లేదు. కేంద్రాన్ని నిద్రపోనీయడం లేదు. దీనికి బాధ్యత వహించి ధర్మేంద ప్రధాన్ రాజీనామా చేస్తేనే గానీ వదిలేలా లేరు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంలో వారి టార్గెట్ మోడీనే. ప్రధాన్ భుజంపై తుపాకీ పెట్టి మోడీని కాల్చే ప్రయత్నం చేస్తున్నాయి బొద్దింకలు. ఈ విషయం తెలుసుకోనంత అమాయకులేం కారు మోడీ, అమిత్ షాలు. కానీ వీరి డిమాండ్కు తలొగ్గితే..తమ ఓటమిని అంగీకరించినట్టు అవుతుందనే భావన ఓ వైపు.. బొద్దింకలకు బలం పెంచడం ద్వారా పరోక్షంగా ఇది ఎన్డీయేకు ప్రతికూలంగా, ఇండి కూటమికి అనుకూలమైన స్థితికి తామే కారణమవుతామనే అభిప్రాయమూ కేంద్రంలో ఉంది.
అందుకే ఇంతగా అగ్గి రాజుకుంటున్నా.. చీమ కుట్టినట్టు కూడా లేదు తెలుసా..? అన్నట్టుగా ఉంటున్నారు. కాదు కాదు నటిస్తున్నారు.