చిరంజీవి సినిమాలో ఓ ఫేమస్ డైలాగ్ ఉంది. ఓ ప్రాణం పోశా.. ఓ ప్రాణం తీశా..! లెవలైపోయింది..! అని. సేమ్…అట్లనే నడిచింది రైతు భరోసా కార్యక్రమం. సీఎం ప్రసంగం.
రైతులకు ఏమేమీ చేశామో వివరంగా చెప్పారు సీఎం. ఎన్ని లక్షలు ఇప్పటి దాకా ఖర్చు పెట్టిందీ వివరించారు. ఎంత కష్టపడి రైతులకు రైతు భరోసా వేస్తున్నదీ కళ్లముందుంచారు. ఇకపై కూడా ఇలాగే రైతులకు పైసలు జమ చేసి మరీ టంచన్గా అందిస్తానని కూడా మాటిచ్చారు. కరువు నేపథ్యంలో రైతులు చూసి వ్యవసాయం చేసుకోవాలని సూచించారు.
ఇంటికి పెద్దలా అన్ని హితోక్తులు చెప్పారు. కష్టాలు, నష్టాలు చర్చించారు. గతంలో చేసిన అప్పులు.. తిప్పల గురించీ గుర్తు చేశారు. ఆర్థిక విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్లే క్రమంలో ఒక్కొక్కటిగా అవరోధాలను అధిగమిస్తున్న వైనాన్ని విడమర్చి చెప్పారు. రైతుల పండుగగా ఈ సందర్భాన్ని అభివర్ణించిన సర్కార్.. రైతు భరోసా నిధులు వేసి రైతులను ఖుషీ ఖుషీ చేసింది. పండుగనే తలపించింది.
ఆ తరువాతే అసలు కథ మొదలుపెట్టారు సీఎం. ఇక్కడ రైతుల కళ్లల్లో ఆనందం చూసిన సీఎం.. కేసీఆర్ కుటుంబ రాజకీయం గురించి వరుసబెట్టి పేల్చిన తూటాలతో వారికి రక్తకన్నీరు సినిమా చూపించినంత పనిచేశారు. భరోసాతో రైతుల ఖాతాలు నింపిన ఆయన.. కేసీఆర్ కుటుంబ రాజకీయాలను ఊచకోత కోసినంత పనిచేశారు.
ఈ మధ్య కేటీఆర్ తమ పార్టీ మీటింగులలో పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, అంతటా ఇదే నినాదం వినిపిస్తుందని. దీనిపైనే రేవంత్ పూర్తిగా గతం తవ్వారు. చరిత్ర ముందేసుకున్నారు. వర్తమానం వివరించారు. తప్పులన్నీ తవ్వి తీశారు. అప్పుల బాగోతం బట్టబయలు చేశారు.
తెలంగాణ చేతికి చిప్పని అప్పగించిన వైనంపై ఏకరువు పెట్టారు. పద్దెనిమిది మంది సీఎంలు చేయనంత అప్పు.. ఒక్క పదేండ్లలోనే కేసీఆర్ చేశాడని గణాంకాలతో సహా వివరించారు. కేసీఆర్ దెబ్బకు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ బికారీ అయ్యిందన్నారు. దివాళా సంసారంగా రాష్ట్రాన్ని మార్చిన ఘనత కేసీఆర్దేనన్నారు.
కేసీఆర్ అప్పులు చేసుడే కాదు.. దీనికి పోటీగా తప్పులను కూడా చేస్తూ పోయాడన్నారు. నూనుగు మీసాల పోరగాళ్లను కూడా తాగుబోతులను చేసి పోయాడని, కేసీఆర్ పాలన అంటేనే తాగుడు పాలన అని దుయ్యబట్టారు. రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని.. ఇది ఎవరి పేటెంటు కాదన్నారు.
భార్యభర్తలు మాట్లాడుకునే ఫోన్లు కూడా విన్నారని, అలాంటోళ్లను మళ్లీ రానిస్తారా? అని అడిగారు. అరుంధతి సినిమాలో పశుపతి మాదిరిగా.. కేసీఆర్ను తాళ్లతో, గొలుసులతో ఫామ్హౌజ్లో బంధించామన్నారు. ఇక బయటకు రాడని, ఎవరూ భయపడొద్దన్నారు.
ఒకప్పుడు ఉద్యోగాల కోసం ధర్నాలు చేసేదని, ఇప్పుడు నోటిఫికేషన్లు వేస్తుంటే.. వద్దు వద్దు అని ధర్నాలు చేస్తున్నారన్నారు. ఎవరెంత అరిచినా.. పొర్లుడుదండాలు పెట్టినా.. ఎండ్రిన్ తాగి సచ్చినా.. తాను చేసేది తాను చేసి తీరుతానని ఈ వేదకగా శపథం పూనారు సీఎం రేవంత్ రెడ్డి.