Ayodhya: అయోధ్య రామమందిర విరాళాల దొంగతనం కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ట్రస్ట్ పేరిట నకిలీ వెబ్సైట్లు, క్యూఆర్ కోడ్ల ద్వారా కోట్ల రూపాయల నిధులు దారిమళ్లింపు.. భూముల కొనుగోలు వ్యవహారాలపై పలువురు కోర్టులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం ముదిరింది. అయితే, ట్రస్ట్ అధికారిక బ్యాంక్ ఖాతాల్లోని నిధులు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని, నకిలీ సైబర్ ఖాతాలను ముందే గుర్తించి బ్లాక్ చేశామని ఎస్బీఐ.. ఆర్టీఐ ద్వారా వివరణ ఇచ్చింది.
సిట్ విచారణకు హాజరైన ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్.. విరాళాల లెక్కింపులో జరిగిన అవకతవకలపై వాంగ్మూలం ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారనే ఉద్దేశంతోనే ట్రస్ట్ సభ్యులైన డాక్టర్ అనిల్ మిశ్రా, గోపాల్ రావుల ప్రమేయంతోనే.. కొంతమంది బంధువులు, పరిచయస్తులను కౌంటింగ్ విధుల్లో చేర్చుకున్నామని అంగీకరించారు. అయితే ట్రస్ట్, ఎస్బీఐ 2025లో కుదిరిన ఒప్పంద అమలు చేయకపోవడమే ఈ లూప్హోల్స్కు కారణమని సిట్ దర్యాప్తులో తేలింది. చంపత్ రాయ్ వ్యక్తిగత అనుచరుడు తిన్నూ యాదవ్ ఈ మోసం చేశాడని దర్యాప్తులో రుపువైంది. కానుకల దుర్వినియోగంపై ఆరోపణలు రాగానే తానే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశానని చంపత్ రాయ్ చెప్పారు. ఈ కేసులో తిన్నూ యాదవ్తో సహా మొత్తం ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, కోర్టు వారికి జులై 13 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
ఈ వ్యవహారంపై ఇరుపక్షాల న్యాయవాదులు కోర్టులో బలమైన వాదనలు వినిపిస్తున్నారు. భక్తుల సెంటిమెంట్తో ముడిపడిన విరాళాల సొమ్ము దుర్వినియోగం కావడం వెనుక ట్రస్ట్లోని పెద్దల హస్తం ఉందని.. కాబట్టి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని పిటిషనర్ల తరపు లాయర్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, ఫైజాబాద్ బార్ అసోసియేషన్ సైతం భక్తుల సెంటిమెంట్ను దెబ్బతీసిన ఈ నిందితులకు ఎలాంటి లీగల్ సపోర్ట్ ఇవ్వకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే 5 లక్షల జరిమానా విధిస్తామని సంచలన తీర్మానం చేసింది. క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసిన సిట్.. త్వరలోనే కోర్టుకు ఛార్జ్షీట్ సమర్పించనుంది.
Also read: Telangana BJP: తెలంగాణ బీజేపీ నేతలకు నితిన్ నబీన్ మాస్ వార్నింగ్.. పద్ధతి మార్చుకోవాలంటూ ఫైర్!