Madanapalle Global Horticulture Centre: రాయలసీమ అభివృద్ధి లక్ష్యంగా మరో భారీ ప్రాజెక్టు రాబోతోంది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏకంగా రూ.1 లక్ష కోట్ల పెట్టుబడితో ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే మదనపల్లెతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ఆర్థిక పరిస్థితుల్లో కూడా పెద్ద మార్పు వస్తుందని భావిస్తోంది.
ఈ భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా కలిసి పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు రూ.40 వేల కోట్లు పెట్టుబడి పెట్టనుండగా, ప్రైవేట్ పెట్టుబడిదారుల నుంచి మరో రూ.60 వేల కోట్లు సమకూరనున్నాయి. మొత్తం రూ.1 లక్ష కోట్లతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన పనులు ప్రారంభమైన తర్వాత మదనపల్లె ప్రాంతంలో కొత్త పరిశ్రమలు, వ్యాపార అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.
ఈ ఉద్యానవన కేంద్రం ప్రధానంగా రైతులకు ఉపయోగపడేలా రూపొందించనున్నారు. ప్రస్తుతం పండ్లు, కూరగాయలు లాంటి ఉద్యాన పంటలను పండిస్తున్న రైతులు నిల్వ, రవాణా, మార్కెటింగ్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. పంట చేతికి వచ్చిన సమయంలో సరైన ధర రాకపోవడంతో కొంతమంది రైతులు నష్టపోతున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపేలా ప్రాజెక్టులో ఆధునిక కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. పంటలను ఎక్కువ కాలం నాణ్యత తగ్గకుండా నిల్వ చేసుకునే అవకాశం రైతులకు లభిస్తుంది. దీంతో మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తమ ఉత్పత్తులను విక్రయించుకునే వెసులుబాటు ఏర్పడుతుంది.
పంటలను నేరుగా మార్కెట్కు పంపడం కాకుండా వాటిని శుద్ధి చేసి విలువ పెంచే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. పండ్లు, కూరగాయలతో పాటు ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన ప్రాసెసింగ్ పరిశ్రమలు రావడంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఉత్పత్తులను నేరుగా అంతర్జాతీయ మార్కెట్లకు పంపేలా ఎగుమతి సదుపాయాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రాయలసీమలో పండించే ఉద్యాన పంటలకు విదేశీ మార్కెట్లలో కూడా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.
రాయలసీమలో ఇప్పటికే ఏరోస్పేస్, డ్రోన్లు, ఆటోమొబైల్ వంటి రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పుడు ఉద్యానవనం, ఆహార శుద్ధి రంగాలను కూడా పెద్ద స్థాయిలో అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు, స్థానికంగా ఉద్యోగాలు పెరగడంతో పాటు రైతుల ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రాజెక్టు చుట్టుపక్కల భూములు, వ్యాపార కార్యకలాపాలకు డిమాండ్ మరింత పెరగనుంది. మదనపల్లెలో ప్రతిపాదించిన ఈ రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టు రాయలసీమలో వ్యవసాయం నుంచి ఎగుమతుల వరకు మొత్తం వ్యవస్థ మారిపోయే అవకాశం ఉంది.
Read Also: అమరావతిలో మినీ అమెజాన్.. ఐదు ఎకరాల్లో అద్భుత వర్షారణ్యం!