Secunderabad Railway Station Inauguration: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొత్తరూపు సంతరించుకుంది. విమానాశ్రయం తరహాలో ఆధునిక సౌకర్యాలతో స్టేషన్ ను రెడీ అవుతోంది. పునర్నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ పనుల కారణంగా పలు రైళ్లను హైదరాబాద్ లోని ఇతర స్టేషన్ల నుంచి నడిపిస్తున్నారు. సుమారు ఏడాది కాలంగా ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ ఇబ్బందికి చెక్ పడనుంది. త్వరలోనే అన్ని రైళ్లు మళ్లీ సికింద్రాబాద్ స్టేషన్ నుంచే నడిచేలా రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పనులు పూర్తి కావచ్చిన నేపథ్యంలో వచ్చే నెలలో స్టేషన్ ను పునః ప్రారంభించాలని భావిస్తున్నారు.
స్టేషన్ ఆధునీకరణ పనులు శర వేగంగా సాగుతున్నాయి. ఫేజ్-1 పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు స్టేషన్ను తిరిగి అందుబాటులోకి తీసుకురావడానికి రైల్వే అధికారులు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చే అవకాశం ఉంది. ఆయన చేతుల మీదుగా ఈ స్టేషన్ ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో ఈ పర్యటన జరిగే అవకాశముంది.
సుమారు రూ.719 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్ను ఆధునీకరిస్తున్నారు. స్టేషన్లో కొత్తగా ఎస్కలేటర్లు, ఎలివేటర్లు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు నేరుగా మొదటి అంతస్తులోకి వెళ్లే సౌకర్యం కల్పించారు. పై అంతస్తుల్లో వెయిటింగ్ హాళ్లు, షాపులు ఏర్పాటు చేశారు. వాటి కింద ప్లాట్ ఫారమ్ లు ఉండేలా డిజైన్ చేశారు. బస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్కు, అక్కడి నుంచి మళ్లీ బస్ స్టేషన్ కు వెళ్లేందుకు స్కైవాక్ లు ఏర్పాటు చేశారు. ఈ నిర్మాణాలతో స్టేషన్ పూర్తిగా కొత్తగా కనిపిస్తోంది.
మొదటి దశలో ప్లాట్ఫామ్-10 వైపు పనులు పూర్తయ్యాయి. మార్చి నెలాఖరులోగా ఈ భాగాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడానికి దక్షిణ మధ్య రైల్వే ప్రయత్నిస్తోంది. మొత్తం స్టేషన్ నాలుగు అంతస్తులతో 22,516 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. దక్షిణ భాగంలో మరో భవనం కూడా నిర్మించారు. ఇది 14,972 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది.
రెండో దశలో మిగతా ప్లాట్ ఫారమ్ ల దగ్గర కూడా పనులు పూర్తవుతాయి. ఈ పనులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తయ్యేలా ప్రణాళిక చేస్తున్నారు. పనులు పూర్తయిన తర్వాత సికింద్రాబాద్ స్టేషన్ పూర్తిగా ఆధునికంగా మారి ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని అందిస్తుంది. అటు ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టుకు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. కొన్ని జాతీయ రహదారులను కూడా ప్రజలకు అంకితం చేయనున్నారు. మొత్తం మీద ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.
Read Also: ప్రకృతి అందాల నడుమ 180 డిగ్రీ వ్యూ.. విస్టాడోమ్ ట్రైన్ జర్నీ ఒక్కసారైనా చేయాలి బ్రో!