రాజ్, కావ్యలకు నర్సు నీలవేణి వచ్చి కొందరు రౌడీలు మీ పాపను చంపాలని చూస్తున్నారు అని చెప్పగానే.. షాక్ అవుతారు. తర్వాత రాజ్ మీరు మన వాళ్లను తీసుకుని వెళ్లిపోండి మిగతా అంతా నేను చూసుకుంటాను అంటాడు రాజ్. దీంతో అక్కడి నుంచి కావ్య, నీలవేణి వెళ్లిపోతారు. తర్వాత రౌడీలు హాస్పిటల్ లోకి రావడం చూసిన నీలవేణి ఫోన్ చేసి రాజ్కు విషయం చెప్తుంది. రాజ్ వెంటనే రంగంలోకి దిగుతాడు. మరోవైపు రౌడీలు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లి చూడగా అక్కడ పాప స్థానంలో ఒక బొమ్మ ఉంటుంది రౌడీలు షాక్ అవుతారు ఇంతలో రాజ్ వచ్చి రౌడీలను కొడుతుంటాడు. మరోవైపు తన ఇంటి దగ్గరకు వచ్చి నిజం చెప్పిన రుద్రాణిని తిట్టి హాస్పిటల్కు బయలుదేరుతాడు మంత్రి ధర్మేంద్ర.
హాస్పిటల్లో రౌడీలతో రాజ్ ఫైట్ చేస్తుంటాడు. ఇంతలో ఒక రౌడీ కత్తితో రాజ్ను పొడవబోతుంటే కావ్య అడ్డు పడుతుంది. కావ్య చేయి తెగిపోయి బ్లడ్ వస్తుంది. అప్పుడే అక్కడకు వచ్చిన మినిస్టర్ ధర్మేంద్ర రౌడీలను అడ్డుకుని వారిని అక్కడి నుంచి తరిమేస్తాడు. మినిస్టర్ ను చూసిన రాజ్ కోపంతో రగిలిపోతుంటాడు. కన్నకూతురిని చంపుకోవాలని అనుకున్నావా? నువ్వు అసలు తండ్రివేనా? నీ భార్య సంతోషం కోసం బిడ్డల్ని మార్చావు.. నీకు వారసురాలు కావాలని నా భార్యకు బిడ్డను దూరం చేశావు.. ఇప్పుడు శాశ్వతంగా మా బిడ్డ మీ దగ్గరే ఉండాలని చివరికి కన్నకూతురిని కూడా చంపుకోవాలని అనుకున్నావా అంటూ మండిపడతాడు రాజ్.
దీంతో మినిస్టర్ పశ్చాతాపంతో రాజ్ ఎన్ని మాటలు అన్నా పట్టించుకోకుండా నన్ను క్షమించండి రాజ్, కావ్య అసలు మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా లేని పాపాత్ముడిని, మీరు నన్ను క్షమించడం కాదు నరికేయండి అంటాడు. దీంతో కావ్య కోపంగా నిన్ను క్షమించడం కాదు.. నీ లాంటి వాడి నీడ మా మీద పడ్డా మాకు పాపం చుట్టుకుంటుంది అనగానే.. మినిస్టర్ బాధపడుతూనే.. మా ఆనందం కోసం మిమ్మల్ని ఏడిపించిన రాక్షసుడిని. కానీ ఆ రాక్షసత్వం ఈరోజు నీ మాతృత్వం ముందు ఓడిపోయింది. నేను చేసింది తప్పు కాదు నేరం. నా భార్యను బతికించుకోవడం కోసం నీ అమ్మతనాన్ని బలి చేశాను, స్వార్ధంగా ఆలోచించాను. మనసులో మరో తల్లికి అన్యాయం చేస్తున్నాను అనిపించినా… నా స్వార్ధం, నా భార్య ఆనందం దానిని చూడనివ్వకుండా చేసింది. అందుకే కళ్లు తెరిచి మీ ముందు ఇలా దోషిగా నిలబడ్డాను. మీకు ఏ సంబంధం లేని బిడ్డ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు.. నా పాపని కాపాడటానికి ఆరాటపడ్డారు. కానీ నేను నా కన్నకూతురిని చంపడానికి సిద్ధపడ్డాను, నేను తండ్రినని చెప్పుకునే అర్హత కూడా నాకు లేదు.. నా పాపకి ఉన్న ఆరోగ్య సమస్య తెలిసి భయపడ్డాను.. నా భార్య ఏమైపోతుందోనని బెదిరిపోయాను.
పిల్లల్ని మార్చేస్తే నా ఇల్లు వెలిగిపోతుందని అనుకున్నానే కానీ ఓ తల్లి పేగు బంధాన్ని తెంచేస్తే అది చీకటిగా అయిపోతుందని ఇప్పుడే అర్ధమైంది.. నన్ను క్షమించండి.. మీరు పడ్డ బాధకి, అనుభవించిన క్షోభకు కారణం నేనే.. అందుకు మీరు ఏ శిక్ష వేసినా నేను తలవంచుతాను అంటూ మినిస్టర్ చెప్తుంటే అప్పుడే అక్కడకు వచ్చిన తులసి అంతా విని షాక్ అవుతుంది. నా ఒడిలో ఉన్నది ఎవరి బిడ్డ.. నాకు బిడ్డ పుట్టలేదా? కన్నబిడ్డను మార్చి ఆ తల్లికి అన్యాయం చేసింది మీరేనా.. అంటూ తులసి తిట్టగానే.. ధర్మేంద్ర తాను ఇదంతా నీకోసమే చేశాను.. పుట్టగానే మన బిడ్డకు గుండె సమస్య ఉందని తెలిసింది. అది నీకు తెలిస్తే నువ్వు దక్కవని భయపడి బిడ్డని మార్చేశాను అంటూ నిజం చెబుతాడు.
దీంతో తులసి ఏడుస్తూ.. మీరు చాలా పాపం చేశారు.. ఇలా నా ప్రాణాన్ని కాపాడే బదులు నాకు విషమిచ్చి చంపితే నాకింత బాధగా ఉండేది కాదు అంటూ మినిస్టర్ను తిడుతుంది. కావ్య చేతులు పట్టుకుని సారీ చెప్తుంది. దీంతో కావ్య కూడా తులసిని మెచ్చుకుని ఆయన చేసింది కూడా మీ మీద ఉన్న ప్రేమతోనే కదా అని చెప్తుంది. తర్వాత ఇద్దరూ ఎవరి బిడ్డను వాళ్లు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.