Nindu Noorella Saavasam Serial Today Episode: అంజును వదిలి వెళ్లలేదని ప్రచండను మనోహరి, యాదమ్మ తిడుతుంటారు. హోమం పూర్తి అయ్యేలోపు నువ్వు వెళ్లకపోతే నీ శక్తుల నశిస్తాయని తర్వాత నువ్వు చనిపోతావని.. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోమని యాదమ్మ కోపంగా ప్రచండకు చెప్తుంది. యాదమ్మ మాటలకు నవ్విన అంజులోని ప్రచండ.. ఏ హోమము తనను ఏమీ చేయలేదని.. ఏ దైవశక్తి తనకు సాటి రాదని హోమం అయిపోయినా తాను అంజులోనే ఉంటానని బుజ్జమ్మను చంపేసి ఆ శక్తులు తీసుకునే వెళ్తానని చెప్తాడు. ఆ మాటలకు మనోహరి, యాదమ్మ షాక్ అవుతారు. హోమం చూస్తున్న ప్రచండ ఆ మంత్రాలకు తన చెవులకు చిల్లులు పడేలా ఉందని కోపంతో రగిలిపోతూ చెవులు మూసుకుంటాడు.
హోమం పూర్తి కాగానే.. పూర్ణాహుతి సమర్పించడానికి స్వామిజీ తనతో తీసుకొచ్చిన పరమశివుడి ముడుపును అమర్కు ఇస్తాడు. ఇది పరమ పవిత్రమైన పరమశివుడికి తమ ఆశ్రమంలో కట్టిన ముడుపు అని అది పూర్ణాహుతిగా సమర్పిస్తే ఈ ఇంట్లో ఉన్న సమస్త దోషాలు హరించుకుపోతాయని.. ఇంట్లో ఉన్న భూత, ప్రేత, పిశాచ గణాలు పారిపోతాయని చెప్తాడు. అమర్ ఆ ముడుపు తీసుకుని మొక్కి హోమగుండంలో పూర్ణాహుతిగా సమర్పిస్తాడు. స్వామి ఇక హోమం అయిపోయిందని హారతి ఇస్తాడు. అందరూ హారతి తీసుకుంటుంటే.. మనోహరి, యాదమ్మ, అంజు దూరంగా ఉండి చూస్తుంటారు. అమర్ వాళ్లను కూడా దగ్గరకు వచ్చి హారతి తీసుకోమని చెప్తాడు. మనోహరి, యాదమ్మ దగ్గరకు వచ్చి హారతి తీసుకుంటారు. అంజు మాత్రం దూరం నుంచే హారతి తీసుకుంటుంది. స్వామిజీ అది గమనించి అంజును అనుమానంగా చూస్తుంటాడు.
మనోహరి మాత్రం యాదమ్మతో అనుమానంగా చంభా హోమం అయిపోయింది కదా..? అంజులోంచి ప్రచండ వెళ్లిపోయాడా..? అంటూ అంజు అంజు అంటూ పిలుస్తుంది. పలకదు.. యాదమ్మ మాత్రం ప్రచండ అని పిలవగానే.. ఏంటి చంభా అంటూ ప్రచండ పలుకుతాడు. మనోహరి, యాదమ్మ షాక్ అవుతారు. నువ్వు ఇంకా అంజును వదలలేదా ప్రచండ అంటూ మనోహరి అడిగితే ప్రచండ కోపంగా చెప్పాను కదా..? ఏ శక్తి నన్ను ఏమీ చేయలేదని.. అంటాడు. మనోహరి మాత్రం భయంగా చూస్తూనే ఉంటుంది.
స్వామిజీ హోమంలోంచి భస్మం తీసి ఈ హోమ భస్మాన్ని మీరందరూ నుదుటి మీద ధరించాలి అంటూ అందరినీ దగ్గరకు పిలిచి భస్మం పెడుతుంటాడు. దూరం నుంచి చూస్తున్న ప్రచండ మనసులో ఓహో స్వామి ఇదా నీ ఎత్తుగడ పరమశివుడి విబూధితో సమానమైన హోమ భస్మంతో నన్ను భస్మం చేసి బయటకు పంపాలని చూస్తున్నావా..? అనుకుంటాడు. అప్పుడే స్వామిజీ అంజు దగ్గరకు రామ్మ నువ్వు హోమ భస్మం ధరించు అని చెప్పగానే.. అంజు భయంతో నాకే భస్మం వద్దు.. నేను ఏ బొట్టు పెట్టుకోను అంటూ దూరంగా జరుగుతుంది.
మిస్సమ్మ కోపంగా నువ్వు భస్మం ధరించాల్సిందే.. అంటూ బలవంతంగా వెళ్లి అంజుకు భస్మం పెడుతుంది. భస్మం పెట్టగానే.. అంజులో ఉన్న ప్రచండ పారిపోతాడు. వెంటనే అంజు స్పృహ కోల్పోతుంది. అంజు కింద పడిపోవడం చూసి అందరూ కంగారు పడుతుంటే.. మనోహరి, యాదమ్మ మాత్రం హమ్మయ్య ప్రచండ వెళ్లిపోయినట్టు ఉన్నాడు అని ఊపిరి పీల్చుకుంటారు. కట్ చేస్తే అంజు రూంలో బెడ్ మీద పడుకుని ఉంటుంది. అందరూ చుట్టూ కూర్చుని ఉంటారు. అంజు మెల్లగా కళ్లు తెరచి అటూ ఇటూ చూసి నేనేంటి ఇక్కడ ఉన్నాను..? అసలు నాకేమైంది అంటూ అందరినీ అడుగుతుంది. అందరూ షాకింగ్ గా చూస్తుంటారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.