హాస్పిటల్ లో ఉన్న కావ్య, రాజ్, డాక్టర్ తులసి దగ్గరకు వెళ్లి నాటకం మొదలు పెడతారు. ఇంతలో తులసి చేతిలో ఉన్న కావ్య పాప ఏడుస్తుంది. దీంతో కావ్య పాపకు పాలు పడతాను ఇవ్వండి అని అడుగుతుంది. వేరే వాళ్ల పాలు పడితే మంచిదేనా డాక్టర్ అని తులసి అడగ్గానే.. మంచిదే అని డాక్టర్ చెప్తుంది. దీంతో తులసి పాపను కావ్యకు ఇస్తుంది. కావ్య పాపను తీసుకుని పక్కకు వెళ్లి పాలు పడుతుంది. పాలు పడుతూ ఏమోషనల్ అవుతుంది. తప్పు ఎవరు చేసినా ఈ అమ్మకి దూరమై నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు.. దీనికి కారణం నేను కాకపోయినా, నీకు గుక్కెడు పాలు ఇవ్వలేకపోయాను తల్లి అంటూ కావ్య బాధపడుతుంది. అదంతా చూస్తున్న రాజ్ ఎమోషనల్ అవుతాడు. కావ్య చేతుల్లోంచి తన సొంత బిడ్డను తీసుకున్న తులసి ఆడిస్తూ ఉంటుంది.
ఇంతలో కావ్య పాపను తీసుకుని తులసి దగ్గరకు వస్తుంది. అప్పుడు తులసి మీ వల్లే మా పాప ఏడుపు ఆపింది. ఇక మీ పాపను తీసుకుని నా పాపను ఇవ్వండి.. మనిద్దరికీ ఏదో రుణానుబంధం ఉన్నట్లుగా ఉంది. లేకపోతే ప్రతిసారి మా పాపకు మీరే సాయం చేస్తున్నారు. ఆరోజు గుడిలో ఏడిస్తే పాట పాడి ఊరుకోబెట్టారు.. ఈరోజు నా పాప ఆకలి తీర్చారు. మీ రుణాన్ని పెంచుకుంటూ పోతున్నారు అనగానే.. కావ్య బాధపడుతుంది. నేను కూడా తల్లినే బిడ్డ ఆకలికి రుణం అని పేరు పెట్టడం సరికాదు అంటుంది. దీంతో తులసి నా కోసం ఇంత చేసిన మీకు నేను ఏదైనా చేయాలని చిన్న ఆశ అంటుంది తులసి. పాపను బాగా చూసుకుంటే నాకు అదే చాలని కావ్య చెబుతుంది.
పాప నా ప్రాణం.. మీరు ఒకసారి మా ఇంటికి రండి, మా వారు తలచుకుంటే మీ సమస్య ఇట్టే తీరిపోతుందని తులసి పిలవగానే రాజ్ మీరు చెప్పారు కదా రాకుండా ఉంటామా అంటాడు. తులసి వెళ్లిపోతుంది. కావ్య మాత్రం ఎమోషనల్ అవుతుంది. ఆ దేవుడు నాతో ఇలా ఆడుకుంటున్నాడు.. నా బిడ్డకు నేను పాలివ్వడానికి.. నా బిడ్డను ఇంకొక్క నిమిషం హత్తుకోవడానికి, ఇంకొకరిని అడగాల్సి వస్తోందని కావ్య బాధపడుతుంది. నా పాప అలా వెళ్లిపోతుంటే నా ప్రాణాన్ని ఎవరో పట్టుకుని తీసుకుని వెళ్లిపోతున్నట్లుగా ఉందని అంటుంది కావ్య. ఆ దేవుడు మన పాపని దూరం చేయడం లేదు. నీకు దగ్గర చేస్తున్నాడని.. మన పాప త్వరలోనే మన దగ్గరకి తిరిగి వస్తుంది.. లేకపోతే ఆ దేవుడు ఇలా చేయడు అంటాడు రాజ్.
తర్వాత పాప జాతకం చూపించడానికి దుగ్గిరాల ఫ్యామిలీ పంతులు గారిని పిలిపిస్తుంది. పాపది మహర్జాతకం, కాకపోతే.. పాప జీవితంలో కొన్ని అడ్డంకులు ఉన్నాయి.. అయినా అనుకున్నది సాధిస్తుంది, మహారాణి జాతకం. పాప పుట్టగానే హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందని.. తన ఆరోగ్యం ఎలా ఉంటుందోనని టెన్షన్గా ఉందని అంటుంది అపర్ణ. జాతకంలో అలాంటి అడ్డుంకులు, సమస్యలు ఏమీ చూపించడం లేదని అంటాడు పంతులు. పాపను కన్న తల్లిదండ్రుల జాతకాన్ని బట్టి పాప ఆయుష్య రేఖ చాలా బలంగా ఉంది. నిండు నూరేళ్లు హాయిగా ఉంటుంది.. ప్రయాణంలో ఎత్తుపల్లాలు ఎంత సహజమో, జీవితంలో చిన్నపాటి ఇబ్బందులు సహజమని అంటాడు పంతులు.
మరోవైపు బిడ్డ గురించి, తులసి గురించి ఆలోచిస్తున్న మినిస్టర్ని రుద్రాణి ఓదారుస్తుంది. కావ్య సొంత ఇట్లోనే పిచ్చిది అయిపోయింది.. అలాంటిది మిమ్మల్ని ఎదుర్కోవడం మామూలు విషయం కాదు అంటుంది. అప్పుడే రాజ్, కావ్యలు కలిసి ధర్మేంద్ర ఇంటికి వస్తారు. వాళ్లను చూసిన రుద్రాణి పక్కకు వెళ్లిపోతుంది. మినిస్టర్ షాక్ అవుతాడు. ఎందుకు వచ్చారని రాజ్ కావ్యలను అడుగుతాడు. దీంతో రాజ్ నా భార్య చేయి పట్టుకుని నా బిడ్డ కోసం మీ గుమ్మంలోకి వచ్చేశాను అని చెప్తాడు. దీంతో ధర్మేంద్ర కోపంగా నా గురించి మీకు తెలియదు.. నేను ఏం చేయగలనో, ఎంతకు తెగించగలనో మీకు తెలియదు అంటూ వార్నింగ్ ఇస్తాడు.
అప్పుడే తులసి వస్తుంది. తులసిని చూసి ధర్మేంద్ర సైలెంట్ అవుతాడు. తులసి ధర్మేంద్రతో తన బిడ్డ కోసం కావ్య ఎంతో బాధపడుతుందని వాళ్ల బిడ్డను వాళ్లకు అప్పగించడంలో మీరే సాయం చేయాలని.. అప్పుడే వాళ్ల రుణం మనం తీర్చుకున్న వాళ్లం అవుతాం చెప్తుంది. మినిస్టర్ కోపంగా వాళ్ల రుణం మనం తీర్చుకోవడం ఏంటీ అంటాడు. ఈరోజు మన పాప బోరున ఏడుస్తుంటే పాపకి పాలు పట్టి మన పాప ఆకలి తీర్చింది అని తులసి చెప్పగానే.. ధర్మేంద్ర, చాటుగా ఉన్న రుద్రాణి షాక్ అవుతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.